ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం, టార్గెట్ మోడీ-యోగి: ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ: యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూతురు, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిని ఇచ్చారు. ఆమెకు పదవి ఇవ్వడం ద్వారా 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అతి కీలక నిర్ణయం తీసుకున్నట్లు అయింది.
ఢిల్లీ: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకా గాంధీ – ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ప్రియాంకా గాంధీ – సార్వత్రిక ఎన్నికల వేళ ప్రియాంకను రంగంలోకి దించిన కాంగ్రెస్#PriyankaGandhi #Congress #RahulGandhi pic.twitter.com/j1zhxkcPXj
— Oneindia Telugu (@oneindiatelugu) January 23, 2019
ఆమెను యూపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రియాంక గాంధీకి ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. తూర్పు ఉత్తర ప్రదేశ్ బాధ్యతలను హైకమాండ్ అప్పగించింది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింధియాను నియమించారు. ఇప్పటి వరకు యూపీ జనరల్ సెక్రటరిగా ఉన్న గులాం నబీ ఆజాద్ను హర్యానాకు జనరల్ సెక్రటరీగా నియమించారు.
వచ్చీ రాగానే కీలక బాధ్యతలు
ప్రియాంకా రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రియాంక రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచే కాంగ్రెస్ అభిమానులు కోరుకుంటున్నారు. వారి కోరిక ఇప్పుడు నెరవేరింది. వచ్చీ రాగానే ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
ఉత్తర ప్రదేశ్ ఈస్ట్ బాధ్యతలు
ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయ ఆరంగేట్రంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రియాంక గాంధీ వాద్రాని ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారని, ఉత్తర ప్రదేశ్ ఈస్ట్కు జనరల్ సెక్రటరీగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఆమె ఫిబ్రవరి 2019 మొదటి వారంలో ఈ బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు.
టార్గెట్ మోడీ, యోగి ఆదిత్యనాథ్
గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీ 80 లోకసభ స్థానాలకు గాను 73 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో రెండు ముడు సీట్లు కోల్పోయింది. మొత్తంగా దాదాపు డెబ్బై సీట్ల వరకు బీజేపీకి యూపీ నుంచే ఉన్నాయి. అలాగే, యూపీలో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. బీజేపీకి మోడీ తర్వాత యోగి ఆదిత్యనాథ్ కూడా కీలక నేత. దీంతో మోడీ, యోగి ఆదిత్యనాథ్లను లక్ష్యంగా చేసుకొని ప్రియాంకను రంగంలోకి దింపినట్లుగా భావిస్తున్నారు. ఇటీవల బీఎస్పీ, ఎస్పీలు పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టాయి. ఈ కారణంగా కూడా వారిని ఎదుర్కొనేందుకు ఆమెను రంగంలోకి దించి ఉంటారని భావిస్తున్నారు.