ప్రియాంక గాంధీకి కాంగ్రెస్లో కీలక పదవి, రాహుల్ గాంధీ ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంపై ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. ఆ పదవికి ఆమె న్యాయం చేస్తారని అన్నారు. కాంగ్రెస్ సైద్ధాంతిక పోరాటం చేస్తోందన్నారు. ప్రియాంక, జ్యోతిరాదిత్య సింథియా వంటి యువ నేతలతో తాము ఈ పోరాటంలో ముందడుగు వేస్తామని చెప్పారు.
పేదలు, బలహీన వర్గాల కోసం తాము పోరాడుతామన్నారు. తాము ఫ్రంట్ ఫుట్పై పోరాటం చేస్తామని చెప్పారు. తాము యూపీకి, అక్కడి యువతకు అవసరమైనవాటి కోసం పోరాడుతామన్నారు. బ్యాక్ఫుట్ మీద ఆడే పార్టీ తమది కాదన్నారు. ఎక్కడైనా సరే ఫ్రంట్ ఫుట్పైనే ఆడతామన్నారు. యూపీలో ఓ కొత్త, సానుకూల మార్పు వస్తుందన్నారు.
ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారా?: 'ప్రీపోల్ సర్వే' క్రెడిట్ ఆమెకేనా?
తన సోదరి ప్రియాంక చాలా సమర్థురాలన్నారు. తనతో కలిసి పని చేస్తారని చెప్పారు. ఆమె తనతో కలిసి పని చేస్తారని అన్నారు. ఇది తనకు చాలా సంతోషకరమన్నారు. జ్యోతిరాదిత్య సింథియా కూడా చాలా సమర్థుడని చెప్పారు. ప్రియాంక, జ్యోతిరాదిత్యలకు తాను ఓ బాధ్యత అప్పగించానని చెప్పారు.
మాయావతి, అఖిలేశ్లను తాను గౌరవిస్తానని, తమ ముగ్గురి లక్ష్యం ఒకటేనని, అది బీజేపీని ఓడించడమేనని చెప్పారు. మాయావతి, అఖిలేశ్లతో తమకు వైరం లేదని తేల్చి చెప్పారు. తమ మధ్య భావసారూప్యత ఉందని అన్నారు. వారికి సహకరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. బీజేపీ ప్రభుత్వం యూపీని సర్వనాశనం చేసిందన్నారు. తాము బాగు చేస్తామన్నారు. యువత కంటున్న కలలను సాకారం చేస్తామన్నారు.