అచ్చం నానమ్మలా : మురికివాడను సందర్శించిన ప్రియాంకా గాంధీ..ప్రజలతో మమేకం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియమింపబడ్డ తర్వాత తొలిసారిగా ఆమె ప్రజల్లో కనిపించారు. మాజీ ప్రధాని ఇందిరను పోలుస్తూ ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రధాన కార్యదర్శిగా ఆమె తొలిసారి ఢిల్లీలో కనిపించారు. న్యూఢిల్లీలోని ఔరంగజేబు రోడ్డులో ఉన్న మురికివాడలలో ప్రియాంకాగాంధీ పర్యటించారు. ప్రజలతో మమేకమయ్యారు. అయితే తొలిసారిగా మురికివాడల్లో పర్యటించి తాను ఎప్పటికీ సాధారణ మనిషి వైపే అన్న సంకేతాలను పంపకనే పంపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే... ప్రియాంకా గాంధీ తన సోదరుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు తన నివాసం నుంచి బయలు దేరింది. రాహుల్ నివాసం ఔరంగజేబు రోడ్డు క్లస్టర్ తర్వాత ఉంది. అయితే ఆ రోడ్డులో వెళుతుండగా చాలా మురికివాడలు కపిపించడంతో ఆమె వాహనం దిగి అక్కడి ప్రజలను కలుసుకుని వారితో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆశిష్ అనే దివ్యాంగుడైన బాలుడితో కరచాలనం చేసి మాట్లాడారు. తన ఆరోగ్యం గురించి వాకబు చేసి ఆ అబ్బాయి కుటుంబ పరిస్థితులు గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రియాంకా గాంధీ ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆ మురికి వాడకు వచ్చి తమతో సమయం గడుపుతుందని ఆశిష్ చెప్పాడు. తమ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకుంటారని బాలుడు వివరించాడు. ఆశిష్ చికిత్స కోసం అయ్యే ఖర్చు తానే భరిస్తోందని గద్గద స్వరంతో చెప్పాడు ఆశిష్ తండ్రి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న ప్రియాంకాగాంధీ ఏఐసీసీ కార్యదర్శులతో ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ఇంఛార్జీలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆమె లోక్సభ 2019 ఎన్నికల గురించి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి 9న ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్లతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.