ట్విట్టర్ అకౌంట్ తెరిచిన ప్రియాంక గాంధీ, గంటల్లో వేలాదిమంది ఫాలోవర్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం నాడు ట్విట్టర్ అకౌంట్లో ఖాతాను తెరిచారు. ఆమె ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఆమె ట్విట్టర్ అకౌంట్ తెరిచారని తెలియగానే నిమిషాల్లో వేలాది మంది ఆమెను ఫాలో అవుతున్నారు. తెరిచిన గంటల్లోనే.. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఫాలోవర్ల సంఖ్య 57వేలకు పైగా పెరిగింది.
ప్రియాంక గాంధీ కూడా కొందరు నేతలను ఫాలో అవుతున్నారు. సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్, అహ్మద్ పటేల్, రణ్దీప్ సుర్జేవాలా, రాహుల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలతో పాటు కాంగ్రెస్ పార్టీని ఫాలో అవుతున్నారు. మొత్తంగా తమ పార్టీ నేతలనే ఆమె ఫాలో అవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ తూర్పు విభాగం చీఫ్గా ఆమెను రాహుల్ నియమించారు. తాజాగా ప్రజలు, కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు ప్రియాంకా గాంధీ ట్విట్టర్ ఖాతాను తెరిచారు.