ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రియాంకా గాంధీ .. మన శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా దక్కుతుంది
కేంద్రంలో మళ్లీ అధికారంలోకి బీజేపీయే రాబోతోందని, మరో మారు మోడీ సర్కార్ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో చాలా కష్టపడింది. ప్రియాంకా గాంధీని రంగంలోకి దించి మరీ ప్రచారం నిర్వహించింది. అయినప్పటికీ యూపీఏ విజయం సాధించటం కష్టమే అని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పటంతో అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ధైర్యం చెప్పారు. ఈ మేరకు ఓ ఆడియో సందేశాన్ని ఆమె పార్టీ శ్రేణులకు పంపారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాలన్న ఉద్దేశ్యంతోనే ప్రత్యర్థి పార్టీలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రియాంక గాంధీ సూచించారు.
కర్ణాటక కాంగ్రెస్లో అసమ్మతి రాగాలు... బీజేపీ వ్యుహంలో భాగమేనా...
కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్స్ రూమ్స్ వద్ద నిఘా ఉంచాలని, తమ శ్రమకు కచ్చితంగా ఫలితం దక్కుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆ ఆడియోలో ప్రియాంక పేర్కొన్నారు. మరి కొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్న నేపధ్యంలో ఎగ్జిట్ పోల్స్ కు, ఎగ్జాక్ట్ పోల్స్ కి మధ్య ఏ మేరకు వ్యత్యాసం వుంటుందో వేచి చూడాల్సిందే.