రేప్ కేసు విచారణ ఆలస్యంపై ప్రియాంక గాంధీ ఆగ్రహం.. ఎమ్మెల్యే కారణంగానే అంటూ..
ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావోలో జరిగిన రేప్ కేసు ఘటనకు సంబంధించిన విచారణ తీరుపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే కేసులో ఉండటం వల్లనే విచారణ, దోషులకు శిక్ష విషయంలో జాప్యం జరుగుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నావో కేసు విచారణను 45 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికీ 80 రోజుల గడచినా విచారణలో పురోగతి లేదు అని ఆమె మండిపడ్డారు.
ఉత్తర ప్రదేశ్లో మహిళలపై నేరాల శాతం అధికంగా ఉంది. నిందితులపై కేసులు కూడా నమోదు చేయడం లేదు. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఉండటం వల్ల ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు. దాంతో వారి అరెస్ట్ విషయంలో కూడా ఆలస్యం జరుగుతున్నది. మొత్తంగా ఉరిశిక్ష కూడా జాప్యం జరుగుతున్నది అని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
2017లో జూన్ 4వ తేదీన 17 ఏళ్ల యువతిపై జరిగిన రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సేనగర్ ప్రధాన నిందితుడిగా ఉండటంతో విచారణపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నావో రేప్ కేసు జాప్యంపై ప్రియాంక విమర్శలు చేయడంతో దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. తాజాగా హైదరాబాద్లో దిశ హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరోసారి ఉన్నావో కేసు చర్చనీయాంశంగా మారుతున్నది.