వారణాసి నుంచి ప్రియాంక గాంధీ ఔట్..! పోటీ పై స్పష్టత ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ..!!
వారణాసి/హైదరాబాద్ : ఉత్తర్ ప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ ఉత్కంఠతకు తెరపడింది. వారణాసిలో ప్రియాంకా గాంధీ ప్రధాని మోదీ కి వ్యతిరేకంగా పోటీ చేస్తుందని అందరూ భావించారు. పార్టీ అదిష్టానం ఆదేశిస్తే వారణాసి నుండి పోటీ చేసేందకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రియాంకాగాంధీ స్వయంగా ప్రకటించారు. కాని నామినేషన్ల గడువు దగ్గర పడుతున్న తరుణంలో వారణాసి కాంగ్రెస్ శ్రేణులకు చేదు వార్త వినిపించారు కాంగ్రెస్ పెద్దలు. వారణాసి నుండి ప్రియాంకగాంధీ పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు.
చివరి నిమిషంలో మార్పు..! అభ్యర్థిగా అజయ్సింగ్ను ఖరారు చేసిన రాహుల్గాంధీ...!!
వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థి రాజకీయ పోటీ పై నెలకొన్న సందిగ్దతకు తెరపడింది. గత కొన్ని రోజులుగా వారణాసి నుంచి నరేంద్ర మోదీపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. ఇందుకు తగ్గట్టుగా ఆమె కూడా కార్యకర్తల నుంచి అభిప్రాయం తెలుసుకున్నారు. బహిరంగ సభల్లో వారణాసి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని కార్యకర్తలను ప్రియాంక ప్రశ్నించేవారు.
కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపుకోసం ప్రియాంక క్రుషి చేస్తారు..! స్పష్టం చేసిన కాంగ్రెస్..!!
అలాగే నాలుగు రోజుల కిందట అన్న ఆదేశిస్తే.. వారణాసి నుంచి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఆమె దాదాపు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్గాంధీ మాత్రం ప్రియాంకను పోటీ చేసే విషయంపై ఆసక్తి చూపలేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్సింగ్ పేరు ఖరారు అయ్యింది. మరోవైపు ప్రియాంక బరిలో లేకపోవడంతో ఎస్పీ-బీఎస్పీ-ఆర్.ఎల్.డి కూటమి కూడా తన అభ్యర్థిని ప్రకటించనుంది.
ప్రధాని పైన పోటీ ఇబ్బందే..! అందుకే విరమించుకున్న కాంగ్రెస్..!!
ప్రధానంగా ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేయకపోవడం వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రియాంక తూర్పు విభాగం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ ఎన్నికల ముందే ఆమె రాజకీయాల్లో ప్రవేశించారు. ఇదే సమయంలో వారణాసిలో మోదీ గెలుపు దాదాపు ఖాయమే. ఇక్కడ ఎవరు పోటీ చేసినా.. గెలవడం కష్టమే. అందుకే ఓడిపోయే చోట పోటీ చేసి ఓటమితో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో ప్రియాంకను బరిలో నిలపలేదని స్పష్టమవుతోంది.
ప్రియాంకకు మరో అవకాశం..! అమేధీ ఉప ఎన్నికలో ప్రియాంకకు ఛాన్స్..!!
అదీగాక వారణాసిలో కాంగ్రెస్ అంత పటిష్ట ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు లేదు. దీంతో ప్రియాంక పోటీ చేసిన గెలవడం కష్టంగా రాహుల్ భావించారు. దీనికితోడు రాహుల్ ప్రస్తుతం రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్లో పోటీ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల ఆయన గెలిచాక అమేథీని వదలుకుని వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారన్న ప్రచారం ఉంది. అంటే మరో ఆరు నెలల్లో అమేథీలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి ప్రియాంకను బరిలో దించే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో పోటీకి నిలపడం లేదని తెలుస్తోంది.