యూపీలో ట్వీట్ల యుద్దం..!ప్రభుత్వ లోపాలపై సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తోన్న ప్రియాంక గాంధీ..!!
లక్నో/హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అదికార పార్టీకి మద్య ట్వీట్ల యుద్దం నడుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థతి, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాల పట్ల ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీసారు. ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి అక్కడి పోలీసుల నుంచి ఊహించని కౌంటర్ ఎందురైంది.
రాష్ట్రంలో నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ ప్రియాంక గాంధీ విమర్శించిన నేపథ్యంలో యూపీ పోలీసులు గణాంకాలతో సహా ఆమెకు సమాధానం చెప్పారు. 'తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. రెండేళ్లలో 9225 మంది నేరగాళ్లను అరెస్టు చేశాం. మరో 81 మంది చనిపోయారు. జాతీయ భద్రతా చట్టం కింద దాదాపు 200 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశాం. దోపిడీ, హత్యలు, అపరణలు గణనీయంగా తగ్గాయి...' అని యూపీ పోలీసులు ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు.
కాగా ఉత్తర ప్రదేశ్లో నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారనీ... ఏంకావాలంటే అది చేస్తున్నారని ప్రియాంక ఇవాళ ట్వీట్ చేశారు. 'ఉత్తర ప్రదేశ్లోని నేరగాళ్లంతా స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ, తమకేం కావాలంటే అది చేస్తున్నారు. నేరాలు నిరాటంకంగా జరుగుతున్న బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. నేరగాళ్ల ముందు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మోకరిల్లిందా?'అని ప్రియాంక ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ ఈ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే యూపీ పోలీసులు స్పందించడం గమనార్హం. కాగా గత వారంలో కూడా ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్లో మహిళలకు, బాలికలకు రక్షణ కరువైందంటూ విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
పైకి అంతీ సవ్యంగా కనిపిస్తున్న ప్రభుత్వ పెద్దల అండతో కొందరు అరాచకాలకు పాల్పడుతన్నారని, వారి పట్ల యోగీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ ప్రశ్రిస్తోంది. ఐతే బీజేపి ప్రభుత్వం మాత్రం అలాంటి పరిస్థితులు లేవని చెప్పుకొస్తోంది.