జార్ఖండ్ ఎన్నికల ప్రచారకుల జాబితాలో ప్రియాంకా గాంధీ పేరు లేదు: ఎందుకంటే
జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 40 మంది స్టార్ క్యాంపైనర్లతో జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, ఆధిర్ రంజన్ చౌధరి, అశోక్ గెహ్లాట్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు జార్ఖండ్లో ప్రచారం చేయనున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేరు ప్రారంభ ప్రచారకుల జాబితాలో లేదు.
అయితే భవిష్యత్తులో కూడా పార్టీ ప్రచారకుల జాబితాలను వెలువరిస్తుందని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రచారకుల మొదటి జాబితా మాత్రమేనని, మరో నాలుగు జాబితాలు వెలువరించాల్సి ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రక్రియ ముగిసిన కొద్ది రోజులకే జార్ఖండ్ ఎన్నికలకు నగారా మోగింది. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రం కావడంతో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇక్కడ మొత్తం 81 శాసనసభ స్థానాలకు ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
నవంబరు 30 నుంచి డిసెంబరు 20 వరకు పోలింగ్ ఐదు దశల్లో పోలింగ్ నిర్వహించి, డిసెంబరు 23న ఫలితాలు వెల్లడించనున్నారు. నవంబర్ 30 న తొలిదశ పోలింగ్ జరగనున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. మూడు జాబితాలుగా విడుదల చేసిన అభ్యర్థుల లో జార్ఖండ్ అసెంబ్లీలోని 81 స్థానాలలో 31 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఆర్ జె 7 సీట్లపై పోటీ చేస్తుండగా కూటమి వాటాలో ఎక్కువ భాగం జేఎంఎం తీసుకుంది. ఇది నలభై మూడు స్థానాలలో ఎన్నికల్లో పోటీ చేస్తుంది.