ప్రియాంక గాంధీకి ఆ వ్యాధి ఉంది, ప్రజల్ని కొడతారు: సుబ్రహ్మణ్య స్వామి సంచలనం
న్యూఢిల్లీ: ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న ప్రియాంక గాంధీకి ఓ వ్యాధి ఉందని భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు.
ప్రియాంక బైపోలార్ డిజార్డర్ అనే సమస్యతో బాధపడుతున్నారని, అది ఆమె హింసాత్మక క్యారెక్టర్ను తెలియజేస్తోందని, ఈ వ్యాధి ఉన్నవారు ప్రజా జీవితంలో పని చేయలేరన్నారు. సంతోషం మరీ ఎక్కువైతే తీవ్ర భావోద్వేగానికిలోను కావడం, బాధగా ఉన్పప్పుడు తీవ్రంగా కుంగిపోవడం వంటివి చేస్తారన్నారు. ఆమె ప్రజలను కొడతారని అభిప్రాయపడ్డారు.
అంతకుముందు, బీహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా మాట్లాడుతూ... ప్రియాంకా గాంధీ ముఖం అందంగా ఉన్నంత మాత్రానా రాజకీయాల్లో ఆమె రాణించలేరని వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత సుశీల్ మోడీ.. ఆమె ఓ కళంకిత వ్యక్తికి భార్య అని అన్నారు. భూకబ్జా కేసుల్లో దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు వాద్రాను విచారించాయని గుర్తుచేశారు.
కాగా, ప్రియాంక గాంధీని తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇంచార్జిగా నియమించిన విషయం తెలిసిందే. ఆమె ఫిబ్రవరిలో బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ పైన బీజేపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.