ప్రియాంకగాంధీ పదవీబాధ్యతలు, కుంభమేళాకు లింక్..! ఆ తర్వాత రాష్ట్రాల పర్యటన..!
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఢిల్లీ పీఠంపై కన్నేసిన హైకమాండ్.. ఆ మేరకు కసరత్తు చేస్తోంది. అనూహ్యంగా ప్రియాంక గాంధీని పొలిటికల్ స్క్రీన్ పైకి తెచ్చి.. పార్టీ పునాదులు పదిలం చేసేందుకు శ్రమిస్తోంది. ఆమెను ప్రధాన కార్యదర్శిగా నియమించి విజయావకాశాలపై ఆశలు పెంచుకుంటోంది. అయితే ప్రియాంకగాంధీ బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారు, ఆమె కార్యాచరణ ఎలా ఉండబోతోందనేది చర్చానీయాంశంగా మారింది.
ప్రియాంకకు పగ్గాలు..!
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విఫలమవడంతోనే ప్రియాంకగాంధీని తెరపైకి తెచ్చారనే వాదనలు జోరందుకున్నాయి. అయితే అవన్నీ పట్టించుకునే మూడ్ లో రాహుల్ లేనట్లు అనిపిస్తోంది. ఎవరేమనుకున్నా తన పని తాను చేసుకుపోతాననే దృక్పథం కనిపిస్తోంది. అదలావుంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకకు పగ్గాలు అప్పగించినా.. ఆమె ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. అయితే ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పుణ్యస్నానమాచరించి రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం.
కుంభమేళాలో రెండవ షాహి స్నాన్ గా పిలిచే మౌని అమావాస్య (ఫిబ్రవరి 4) రోజున సోదరుడు రాహుల్ తో కలిసి ఆమె పవిత్ర స్నానం ఆచరించనున్నారు. అది కుదరనిపక్షంలో మూడవ షాహి స్నాన్ గా పిలిచే బసంత పంచమి (ఫిబ్రవరి 10) రోజున పుణ్యస్నానం ఆచరించి.. అదే రోజు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ కనిపిస్తోంది.
వారసత్వ రాజకీయాలపై బీజేపీ ఫైర్
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీ చర్చానీయాంశంగా మారింది. ఇందిరాగాంధీ పోలికలున్నట్లుగా చెబుతున్న ప్రియాంకగాంధీ ఛరిష్మాను వాడుకోవాలని ప్లాన్. ఆమేరకు ప్రియాంకగాంధీకి కీలక పదవి కట్టబెట్టారనేది అపొజిషన్ లీడర్ల వాదన. ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమించడంపై ప్రధాని మోడీ ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరని విరుచుకుపడుతున్నారు. బీజేపీ అలాంటి వాటికి చాలా దూరమని వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగు తరాల కాంగ్రెస్ పాలనకు, నాలుగేళ్ల బీజేపీ పాలనకు తేడా ఏంటో ప్రజలే చూడాలని కోరుతున్నారు.
కుంభమేళాతో ముడి..!
రాహుల్ గాంధీ టెంపుల్ రన్ పై బీజేపీ నేతలు చాలాసార్లు భగ్గుమన్నారు. ఎన్నికల నేపథ్యంలోనే గుళ్ల చుట్టూ రాహుల్ చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు. ఆ నేపథ్యంలో ప్రియాంకగాంధీ పొలిటికల్ ఎంట్రీకి కుంభమేళాను వాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2001లో సోనియాగాంధీ కుంభమేళాకు వచ్చారు. అప్పటినుంచి వారి కుటుంబం నుంచి కుంభమేళాకు ఎవరూ హాజరు కాలేదు. ఆ నేపథ్యంలో కుంభమేళా - ప్రియాంకగాంధీ అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. అదలావుంటే పదవీ బాధ్యతలు స్వీకరించాక ప్రియాంక గాంధీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బహిరంగ సభలతో జనాలను ఆకట్టుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.