ప్రెసిడెంట్ పదవి చేపట్టలేనన్న ప్రియాంక.... రేసులో ఆ ఏడుగురు..
ఢిల్లీ : రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఎవరితో భర్తీ చేస్తారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. పలువురు సీనియర్లు ఆ పదవిపై ఆశపెట్టుకోగా.. ఈ మధ్యకాలంలో ప్రియాంక గాంధీ పేరు తెరపైకి వచ్చింది. కొందరు పార్టీ నేతలు ఆమె పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరారు. అయితే కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టే ప్రసక్తేలేదని ప్రియాంక గాంధీ వారికి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శి హోదాలోనే పార్టీకి సేవ చేస్తానని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం.
నేనేందుకు పార్టీ వీడుతా... తేల్చి చెప్పిన నవజ్యోత్ సింగ్ సిద్దూ...
ప్రియాంక బాధ్యతలు చేపట్టాలన్న సీనియర్లు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ ఈ ఏడాదే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవి చేపట్టారు. తూర్పు యూపీ ఇంఛార్జ్గా బాధ్యతలు చేపట్టి ఎన్నికల్లో అలుపెరుగకుండా ప్రచారం చేశారు. తాజాగా యూపీలో సోనాభద్ర కాల్పుల ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రియాంక గాంధీని అడ్డుకుంది. అయితే ప్రియాంక అక్కడే బైఠాయించి పోలీసుల తీరును నిరసించారు. చివరకు బాధితులను కలుసుకుని వారిని ఓదార్చారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి, పార్టీ సీనియర్ నేత నట్వర్ సింగ్, మాజీ ఎంపీ, శతృఘ్న సిన్హా తదితరులు ప్రియాంక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆమె ప్రెసిడెంట్ పదవి చేపట్టే విషయంలో క్లారిటీ ఇచ్చారు.
తెరపైకి ఏడుగురి పేర్లు
ప్రియాంక గాంధీ సైతం రేసు నుంచి తప్పుకోవడంతో ఇక కాంగ్రెస్ సారథ్యబాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారన్న అశం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పగ్గాలు వీరికే అప్పగించనున్నారంటూ పార్టీ సీనియర్లలో కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మల్లిఖార్జున ఖర్గే, సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్, కుమారి సెల్జా, ముకుల్ వాస్నిక్, సచిన్ పైలెట్, జ్యోతిరాదిత్య సింథియా, తదితరుల్లో ఒకరికి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున అధ్యక్షుడి ఎంపికలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.
రాహుల్ వచ్చాకే నిర్ణయం
ప్రస్తుతం అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ తిరిగి వచ్చిన తర్వాతే కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకోనున్నట్లు సమాచారం. కొత్త సారథి ఎంపిక మరింత ఆలస్యమయ్యే పరిస్థితి తలెత్తితే తాత్కాలిక అధ్యక్షుడిగా ఒకరిని ఎన్నుకుని అంతర్గత ఎన్నిక ద్వారా ప్రెసిడెంట్ను ఎంపిక చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.