ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ: బకాయిల చెల్లింపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తనకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని లూటిన్స్ జోన్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. లోధి ఎస్టేట్లోని అకామిడేషన్ 35ను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటి వరకు చెల్లించాల్సిన బకాయిలను ఆమె చెల్లించారు.
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) రక్షణ లేని వ్యక్తులకు ప్రభుత్వ భవనాల్లో ఉండే అర్హత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ భవనం ఖాళీ చేయాలంటూ ప్రియాంక గాంధీకి జులై 1న నోటీసులను జారీ చేసింది. నెలలోగా భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది.
ఆగస్టు 1, 2020 కంటే ఎక్కువ కాలం భవనాల్లో నివసిస్తూ జరిగే నష్టానికి అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. కాగా, ఆ తర్వాతి రోజే ప్రియాంక నివసించిన భవనాన్ని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి అనిల్ బాలునీకి కేటాయించారు.
జడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన వ్యక్తులకు ప్రభుత్వ బంగ్లాలను కేటాయించే అవకాశం లేదని ప్రస్తుత నిబంధనలు చెబుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. హోంమంత్రిత్వశాఖ చెబితే తప్ప ఈ భద్రత పొందేవారికి భవనాలు కేటాయించే అవకాశం ఉండదు.
అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ది డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్స్ ఆధ్వర్యంలోని ది జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్(జీపీఆర్ఏ) యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ భవనాలను కేటాయిస్తుంది. కాగా, 1997లో ప్రియాంక గాంధీకి లోధి ఎస్టేట్ బంగ్లా 35ను కేటాయించారు.
Recommended Video
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ప్రియాంక బంధవు నివాసమైన కౌల్ నివాస్లో ఉండేందుకు ఆమె సిద్ధమయ్యారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 2022లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆమె అక్కడే ఉండనున్నట్లు వెల్లడించాయి.