ప్రియాంక గాంధీ వాద్రాకు మరో షాక్: ఆగస్టు 1లోగా ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలి, లేదంటే జరిమానా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీలో లోథీ రోడ్లో ఆమె ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ ఆమెకు స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఆమెకు లేఖ రాసింది.
ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోడీ ఎస్టేట్స్ ప్రభుత్వ బంగ్లా 35ను ఖాళీ చేయాలని కోరింది. ఆగస్టు 1లోగా బంగ్లా ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. అంతకంటే ముందు చెల్లించాల్సిన రూ. 3.46 లక్షల మొత్తాన్ని చెల్లించాలని తేల్చి చెప్పింది.
జూన్ 30, 2020 నాటికి ప్రియాంక గాంధీ రూ. 3,44,677 చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. బంగ్లా ఖాళీ చేయడానికి ముందే ఈ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేశారు.
అంతేగాక, ఆగస్టు 1 తర్వాత ప్రియాంక వాద్రా ప్రభుత్వ బంగ్లాలోనే కొనసాగితే జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ రాసిన లేఖలో తేల్చి చెప్పింది. కాగా, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రియాంక గాంధీకి ఎస్పీజీ భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు ప్రభుత్వ బంగ్లాను రద్దు చేసింది.
ఎస్పీజీ భద్రత పరిధిలోకి వచ్చే కుటుంబసభ్యులకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ బంగ్లాలను ఇస్తారు. ప్రియాంక గాంధీకి పార్టీలో ఎలాంటి అధికార హోదా లేకపోయినప్పటికీ నిబంధనల ప్రకారమే ఇప్పటి వరకు బంగ్లాను కేటాయించారు. కాగా, ప్రియాంక వాద్రాకు ప్రస్తుతం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగిస్తోంది.