టూవీలర్ పై ప్రియాంకా గాంధీ: హెల్మెట్ లేకుండా.. భారీగా చలానా వడ్డింపు..!
లక్నో: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్ ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రాకు షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై ప్రయాణం సాగించినందుకు భారీగా చలానాను విధించారు. ఈ చలానా విలువ 6,300 రూపాయలు. ప్రియాంకా గాంధీ కూర్చున్న స్కూటర్ ను నడిపిన పార్టీ కార్యకర్తకూ అదే స్థాయిలో జరిమానా విధించారు.
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది ఈ ఘటన. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాజధాని లక్నోలో కొద్దిరోజులుగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చెలరేగుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనలకు మద్దతు తెలిపిన మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ ఆర్ దారాపురిని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్బంధించింది. ఈ సందర్భంగా ఆయనను పరమార్శించడానికి బయలుదేరిన ప్రియాంకా గాంధీని లక్నో పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను ముందుకు కదలనివ్వకుండా కట్టడి చేశారు.
దీనితో ఆమె తన కారు దిగి.. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడి వెంట స్కూటర్ పై దారాపురి ఇంటికి వెళ్లారు. స్కూటర్ పై వెళ్లే సమయంలో దాన్ని నడిపిన పార్టీ నాయకుడు గానీ, వెనక కూర్చున్న ప్రియాంకా గాంధీ గానీ హెట్మెట్ ను ధరించలేదు. దీనితో వారికి చలానా విధించారు లక్నో ట్రాఫిక్ పోలీసులు. సీసీ కెమెరాల ద్వారా స్కూటర్ ను గుర్తించారు. ఆ వెంటనే- స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా దాని యజమాని ఇంటికి చలానాను పంపించారు.
యుపీ 32 హెచ్ బీ 8270 అనే టూవీలర్ పై ఆమె ప్రయాణించారు. ఈ స్కూటర్ రాజ్ దీప్ సింగ్ అనే వ్యక్తి పేరు రిజిస్టర్ అయింది. హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు ఈ నంబర్ గల స్కూటర్ పై జరిమానా విధించామని సూచిస్తూ చలానాను ఆయన చిరునామాకు పంపించారు. రాజ్ దీప్ సింగ్ ఈ జరిమానాను చెల్లించారు.