రాజకీయ ఆటలొద్దు.. ఇలాంటి చవకబారు పనులా? మోడీ సర్కార్పై ప్రియాంక గాంధీ ఫైర్
గాంధీ కుటుంబంతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఎస్పీజీ రక్షణను తొలగించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ అంశం పార్లమెంట్ సమావేశాలను కూడా కుదిపేసింది. ఈ అంశంపై కొద్ది రోజులుగా రగడ జరుగుతున్నా.. గాంధీ కుటుంబం పెదవి విప్పలేదు. తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తాజాగా ఈ అంశంపై మాట్లాడుతూ..
రాజకీయంలో భాగంగానే
మా కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించడం రాజకీయ ఆటలో భాగంగానే జరిగింది. ఇలాంటివి కొద్దికాలంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఇలా ప్రతీకార చర్యలకు పాల్పడటం శోచనీయం అని ప్రియాంక గాంధీ ఘాటుగా విమర్శించారు. మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ప్రియాంక గాంధీ తప్పుపట్టారు.
దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా
మోదీ ప్రభుత్వ తీరుపై ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఉంది. ఆర్థికవృద్ధి రేటు మందగించింది. అలాంటి సీరియస్ విషయాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిందిపోయి.. ఇలాంటి విషయాలపై రాజకీయాలు చేస్తున్నది అని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
మా ప్రభుత్వ హయాంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చవకబారు చర్యలకు పాల్పడలేదు. మా అధికారంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని వాజ్పేయ్కి ఎస్పీజీ రక్షణ కల్పించామనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. కానీ ఇలాంటి రాజకీయ కక్షలకు చోటివ్వకూడదని కాంగ్రెస్ సభ్యులు ఇటీవల ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.
గాంధీ ఫ్యామిలీ, మన్మోహన్కు భద్రత తొలగింపు
గాంధీ కుటుంబానికి చెందిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రక్షణను నవంబర్ 8వ తేదీన కేంద్ర హోంశాఖ ఉపసంహరించింది. ఎస్పీజీ స్థానంలో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) రక్షణను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి గాంధీ కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు బహిరంగంగా విమర్శలు చేయలేదు. కానీ తాజాగా ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో మండిపడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగినట్లయింది.