టార్గెట్..2022: ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి పగ్గాలు ప్రియాంకా గాంధీ చేతికి?
లక్నో: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కొత్త బాధ్యతలను అందుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటిదాకా ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఆమె.. ఆ రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జిగా పూర్తిస్థాయి బాధ్యతలను చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా ప్రియాంక గాంధీని నియమించాలని పార్టీ అధిష్ఠానం ఇదివరకే ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. 2022లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి నిర్వహించబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
జమ్మూ కాశ్మీర్ లో జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం: స్థలాన్ని కొనబోతున్న ప్రభుత్వం
మొన్నటి లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రియాంకా గాంధీ వాద్రా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్ ఛార్జిగా ఆమె ప్రస్తుతం పనిచేస్తున్నారు. అయినప్పటికీ- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పనే లేదు. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన అమేథీ లోక్ సభ నియోజకవర్గాన్ని సైతం భారతీయ జనతాపార్టీకి ధారదాత్తం చేసుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో- ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. గ్రామస్థాయి వరకూ పార్టీ నాయకత్వం డీలా పడిపోయింది. స్వయంగా రాహుల్ గాంధే ఓటమి చవి చూడాల్సి రావడంతో కాంగ్రెస్ ఉనికిని కోల్పోయే దశకు చేరుకుంది.
ఈ పరిస్థితుల్లో ప్రియాంకా గాంధీ వాద్రాను బరిలో దించడమే మేలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకోవడం కేవలం లాంఛనప్రాయమేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తం ఉత్తర్ ప్రదేశ్ పార్టీ వ్యవహారాలను ప్రియాంకా గాంధీ చేతుల్లో పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. 2022లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల నాటికి పార్టీలో జవసత్వాలను నింపి, నూతనోత్తేజాన్ని తీసుకొచ్చే బాధ్యతను ప్రియాంకా గాంధీ భుజాలపై మోపే అవకాశాలు దాదాపు ఖాయమయ్యాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడొచ్చని స్పష్టం చేశాయి. పూర్తిస్థాయి ఇన్ ఛార్జి బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నందున.. ప్రియాంకా గాంధీ ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నాయకులతో సమావేశాలను నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.