మోడీ కోటలో ప్రియాంకా గాంధీ: కాశీ విశ్వనాథునికి రుద్రాభిషేకం: మెడలో రుద్రాక్షమాల
వారణాశి: ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేసే బాధ్యతను తీసుకున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ తూర్పు ప్రాంత ఇన్ ఛార్జి ప్రియాంకా గాంధీ.. సుడిగాలి పర్యటన కొనసాగుతోంది. గంగా యాత్ర పేరుతో ఆమె ప్రారంభించిన ఎన్నికల ప్రచార కార్యక్రమం మూడో చేరుకుంది. బుధవారం ఆమె వారణాశిలో పర్యటించారు. గంగమ్మ తల్లికి మంగళ హారతి ఇచ్చారు. ప్రఖ్యాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. రుద్రాభిషేకాన్ని చేయించారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ సుమారు గంటకు పైగా ఆమె గర్భగుడిలోనే గడిపారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ మెడలో రుద్రాక్షమాల కనిపించింది.
ఈ కాంగ్రెస్ కు ఎమైంది....? ఓ వైపు టిఆర్ఎస్ ...మరో వైపు బిజేపి....ఎవరు నోరు మెదపరేంది..?
ఉదయం ప్రయాగ్ రాజ్ లోని మనైయా ఘాట్ వద్ద గంగా నదిలో లాంచీలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన.. ప్రియాంకా గాంధీ మధ్యాహ్నానికి వారణాశికి చేరుకున్నారు. పవిత్ర గంగానదిపై లాంచీలో ప్రయాణం సాగించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు పలువురు రైతులు, యువతీ, యువకులు లాంచీలో ప్రయాణించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రియాంకా గాంధీ అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై చర్చించారు. మధ్యాహ్నానికి లాంచీ వారణాశి చేరుకుంది. అక్కడి అస్సీ ఘాట్ వద్ద పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రియాంకాకు స్వాగతం పలికారు. అస్సీ ఘాట్ వద్ద ఆమె వారణాశిలో అడుగు పెట్టారు.
వెంటనే సమీపంలో ఉన్న దశాశ్వమేధ ఘాట్ వద్ద ఆర్తీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి మంగళ హారతి పట్టారు. నదీమతల్లికి పూజలు చేశారు. జైహింద్ అంటూ నినాదాలు చేశారు. అక్కడే కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్లారు. కాశీ విశ్వేశ్వరునికి రుద్రాభిషేకం చేయించారు.
ఆలయ ప్రవేశం వద్దంటూ అభ్యంతరాలు
అంతకుముందు- ప్రియాంకా గాంధీ కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో ప్రవేశించడాన్ని అడ్డుకునే ప్రయత్నాలు సాగాయి. ప్రియాంకా గాంధీ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నందున.. ఆమె కాశీ విశ్వనాథ ఆలయంలో ఎలా పూజలు చేస్తారంటూ పలువురు అభ్యంతరాలు లేవనెత్తారు. ప్రియాంకా గాంధీని ఆలయంలోకి ప్రవేశించనివ్వకూడదని సూచిస్తూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సైతం.. కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వాటిని తోసిపుచ్చుతూ.. ఆలయ పూజారులు ప్రియాంక గాంధీని ఆలయంలోనికి స్వాగతించారు. రుద్రాభిషేకం చేయించారు.