కొత్త పదవి...కొత్త గది...కొత్త నేమ్ ప్లేట్ : అదిరిందమ్మా ప్రియాంకా..!
ఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ పేరును కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ ప్రకటించింది. ఇక అప్పటి నుంచి ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రియాంకా గాంధీకి ఓ గదిని కూడా కేటాయించారు. అంతేకాదు గది బయట ఓ కొత్త నేమ్ ప్లేటు కూడా పెట్టారు. "ప్రియాంకా గాంధీ వాద్రా, జనరల్ సెక్రటరీ" అని పేరు రాసింది. ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమించడంతో పాటు తూర్పు ఉత్తర్ప్రదేశ్ బాధ్యతలను పార్టీ ఆమెకు అప్పగించింది.
ఇప్పటి వరకు ప్రియాంకా గాంధీ ఎప్పుడూ ప్రత్యక్షరాజకీయాల్లోకి రాలేదు. అప్పుడుప్పుడు మాత్రమే తల్లి సోనియాగాంధీ సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వేదికను పంచుకునేవారు. లేదా బహిరంగ సభల్లో పాల్గొనేవారు. కానీ కాంగ్రెస్లో ఇప్పటి వరకు ఎలాంటి పదవులను ఆమె నిర్వర్తించలేదు. అయితే ఈసారి ఎలాగైనా బీజేపీని మట్టికరిపించాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ అనూహ్యంగా ప్రియాంకా గాంధీని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. కేంద్రంలో ప్రభుత్వంను ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం డిసైడ్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుండటంతో అక్కడ ప్రియాంకా చరిష్మా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. అది కాకుండా ప్రియాంకా గాంధీ ఇందిరా గాంధీని పోలి ఉండటంతో పార్టీకి కలిసొచ్చే అంశంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. అయితే ఈసారి అక్కడ సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలు చేతలు కలపడంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడంతో పొత్తుపెట్టుకున్న సమాజ్వాదీ పార్టీ బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. అంతకుముందు తాము చెరో 39 స్థానాల్లో పోటీచేసి రెండు స్థానాల్లో మాత్రం కాంగ్రెస్కు వదిలేశారు. అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు నిలపడం లేదని ఇప్పటికే ప్రకటించారు.