ఎన్నికల్లో పోటీపై ప్రియాంకా గాంధీ క్లారిటీ? వచ్చేనెల మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో పర్యటన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తురుపుముక్క ప్రియాంక గాంధీ వాద్రా.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అనే విషయంపై చర్చ కొనసాగుతోంది. ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తే.. దాని ప్రభావం పార్టీపై ఉంటుందని, మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే అభిప్రాయం సర్వత్రా వినిపించింది. లోక్ సభ బరిలో దిగడానికే ఆమె రాజకీయాల్లో క్రియాశీలక బాధ్యతలను స్వీకరించారని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. తాజాగా- వాటన్నింటినీ తోసి పుచ్చుతూ ప్రియాంక గాంధీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ పోటీ చేయట్లేదు. ఆమె దృష్టి మొత్తం ప్రచార కార్యక్రమాలపైనే కేంద్రీకరించారు. దీనికోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆమె సుడిగాలి పర్యటనలు చేపట్టబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధికారికంగా దీన్ని ధృవీకరించాల్సి ఉంది.
కొద్దిరోజుల కిందటే ప్రియాంకా గాంధీ క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అదే సమయంలో- అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్ ఛార్జిగా అదనపు బాధ్యతలను చేపట్టారు. ఆ వెంటనే ఉత్తర్ ప్రదేశ్ లో నాలుగురోజుల పాటు పర్యటించారు. పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. వారికి దిశా నిర్దేశం చేశారు.
పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడంతో.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా లాంఛనమేనని భావించారంతా. దీనికోసం ఉత్తర్ ప్రదేశ్ లేదా మరో రాష్ట్రంలో లోక్ సభ స్థానాన్ని ఎన్నుకుంటారని అనుకున్నారు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. ప్రియాంక గాంధీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయట్లేదని స్పష్టం చేశాయి. పూర్తిస్థాయి దృష్టిని ప్రచార కార్యక్రమాలపైనే పెట్టారని ఉత్తర్ ప్రదేశ్ పీసీసీ నాయకులు సూచనప్రాయంగా వెల్లడిస్తున్నారు.
పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి అవసరమైన వ్యూహాలను రచించడం, రాష్ట్రాల నాయకులను సమన్వయపరచడం వంటి కార్యక్రమాలపై ఆమె దృష్టి సారించారని అంటున్నారు. త్వరలోనే ఆమె అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తారని చెబుతున్నారు. వచ్చేనెల మొదటి వారంలో ప్రియాంకాగాంధీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పోలింగ్ వారం రోజుల ముందే తెలంగాణ, ఏపీల్లో రెండు చొప్పున బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని స్పష్టం చేస్తున్నారు.