పరువు తీశాడు: ప్రియాంక, రేఖ దాటారని వరుణ్ కౌంటర్
హైదరాబాద్: తన సోదరుడు, భారతీయ జనతా పార్టీ నేత వరుణ్ గాంధీ పైన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. ఆమెకు వరుణ్ కౌంటర్ ఇచ్చారు. వరుణ్ తమ కుటుంబం పరువు తీశారని ప్రియాంక అన్నారు. బంధుత్వంపరంగా ఎవరు ఎంత దగ్గరగానైనా ఉండవచ్చునని కానీ, ఇప్పుడు జరుగుతున్నది సిద్ధాంతపరమైన పోరు అన్నారు. దేశం కోసం తన తండ్రి బలయ్యారన్నారు.
వరుణ్ గాంధీ మంగళవారం ఉత్తర ప్రదేశ్లోని సుల్తాన్పుర నియోజకవర్గం నుండి లోకసభకు నామినేషన్ దాఖలు చేశారు. తన మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన అధికారులకు నామినేషన్ పత్రాలు ఇచ్చారు. ర్యాలీలో మోడీ ఆనవాళ్లు కనిపించలేదు. వాజపేయి, అద్వానీ ఫోటోలు మాత్రమే కనిపించాయి. తన తండ్రి సంజయ్ గాంధీ ప్రస్తావన తెచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రియాంక గాంధీకి కౌంటర్ ఇచ్చారు. తాను ఎప్పుడు లక్ష్మణ రేఖ దాటలేదన్నారు. గౌరవప్రదంగా తాను రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు చెప్పారు. వరుణ్ దారి తప్పారన్న ప్రియాంక వ్యాఖ్యల పైన ఘాటుగా స్పందించారు. ప్రియాంక గాంధీ డీసెన్సీ లక్ష్మణ రేఖ దాటారని విమర్శించారు.
ఎవరో ఏమో అన్నారని తాను తన పరిధిని దాటనని చురకలు అంటించారు. తన దారి ఎప్పుడు దేశం వైపే ఉంటుందన్నారు. తాను వ్యక్తిగతం కంటే దేశానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తాను తన జీవితాన్ని దేశాభివృద్ధికి వినియోగించుతున్నానని, తాను తన జీవితాన్ని అర్థవంతంగా సాగిస్తున్నానని చెప్పారు.