కాంగ్రెస్ బాద్యతలు ప్రియాంక కు అప్పజెప్పాలి..! సంచలన ప్రకటన చేసిన లాల్ బహదూర్ శాస్త్రి తనయుడు..!
ఢిల్లీ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కొత్త అద్యక్షుడు ఎవరనే అంశంపై ఆ పార్టీలో ఆసక్తి రెట్టింపవుతోంది. గాంధీ కుటుంబం నుంచే అభ్యర్ధి అద్యక్షుడుగా ఉంటే అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుందనే వాదనలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. నిన్నటి తరం నేతల నుంచి నేటి యువత వరకూ ఇదే అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నట్టు ఢిల్లీ అక్బర్ రోడ్డులో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పార్టీ కొత్త సారథి వేటలో పడింది. గాంధీ కుటుంబానికి చెందిన వారు కాకుండా కొత్తవారిని నియమించాలని రాహుల్ ఇది వరకే చెప్పారు. ఈ ప్రతిపాదనతో కాంగ్రెస్ సీనియర్లు ఏకీభవించడం లేదు. గాంధీ కుటుంబీకులే అధ్యక్ష పదవిలో ఉండాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ శాస్త్రి తన అభిప్రాయాన్ని నిర్మొహ మాటంగా చెప్పుకొచ్చారు.
"కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో గాంధీ కుటుంబీకులే ఉండాలన్నది నా వాదన కూడా. ఎంతో వైభవం ఉన్న పార్టీని నడిపించే అవగాహన, సామర్థ్యం వారికి మాత్రమే ఉన్నాయి. నాకు తెలిసి ఈ పదవికి ప్రియాంక గాంధీ అయితే సరిపోతుంది. ఆమె ఇందుకు వంద శాతం న్యాయం చేయగలరని మేం నమ్ముతున్నాం. కాంగ్రెస్ను నుంచి ఏర్పడిన తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో రెండు పార్టీలు ప్రస్తుతం అధికారంలో ఉన్నాయి. సరైన నాయకత్వం లేకపోతే అవికూడా అధికారంలో ఉండేవి కావేమో. ప్రస్తుతానికైతే ప్రియాంక సేవలు పార్టీకి ఎంతో అవసరం. ఆమె పార్టీకి పునర్వైభవం తెచ్చేలా పనిచేయగలరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెకు అనుచర గణం బాగా ఉంది. గాంధీ కుటుంబీకులు సారథులుగా లేకపోతే ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అందరూ అంగీకరించే దృఢమైన నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్కు అవసరం" అని అనిల్ శాస్త్రి అన్నారు.