నాన్నమ్మ గది నుంచే రాజకీయ అడుగులు..! ప్రియంక గాంధీ వినూత్న నిర్ణయం..!!
హైదరాబాద్ : ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రియాంక గాంధీ తొలి అడుగు వినూత్నంగా పడబోతోంది. ఇప్పటికే ప్రియాంక రాజకీయ ఎంట్రీ పట్ల కాంగ్రెస్ పార్టీలో అంచనాలు తారా స్థాయిలోకి వెళ్లిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ఆమే నడుచుకోబోతున్నట్టు తెలుస్తోంది. నానమ్మ ఇందిరా గాంధీ పోలికలతో ఉండే ప్రియాంక గాంధీ అప్పట్లో లక్నోలో ఆమే ఉపయోగించిన కార్యాలయాన్నే ఇప్పుడు ప్రియాంక ఉపయోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఏర్పాట్లను కూడా పార్టీ ముఖ్య నేతలు మొదలు పెట్టినట్టు సమాచారం. విదేశాల నుండి ప్రియాంక గాంధీ రాగానే ముఖ్య నాయకులతో నిర్వహించబోయే సమావేశం ఇక్కడినుండే కావడం విశేషం..!!
ఫిబ్రవరి మొదటి వారంలో బాధ్యతల స్వీకరణ..! ఏర్పాట్లలో మునిగిపోయిన పార్టీ శ్రేణులు..!!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో పార్టీకి జవసత్వాలు నింపి ఎక్కువ సీట్లు రాబట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రియాంక గాంధీని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నర కిందట జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం, తాజాగా కాంగ్రెస్ను పక్కన పెట్టి ఎస్పీ-బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంతో యూపీలో ఎలాగైనా పట్టు సాధించాలన్న ప్రయత్నంలో ప్రియాంక గాంధీని యూపీ తూర్పు విభాగం ఇన్ఛార్జిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ నియమించారు. ఆమె ఫిబ్రవరి మొదటివారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ తూర్పు విభాగం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అద్యాయం..! ప్రియాంక ఎంట్రీతో మారనున్న సమీకరణాలు..!!
ప్రియాంక రాక కోసం యూపీ కాంగ్రెస్ నేతలు భారీ కసరత్తు చేస్తున్నారు. ఆమె రాక సందబర్భంగా యూపీలోని లక్నో, అలహాబాద్లో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇక ఆమె కోసం లక్నోలోని నెహ్రూ భవన్ను సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తున్నారు. కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రియాంక కోసం వార్ రూమ్ రెడీ చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఆమె రాజకీయ కార్యకలాపాలు పర్యవేక్షించనున్నారు. అలాగే ఆమె తూర్పు విభాగానికి ఇన్ఛార్జి కావడంతో ఆ ప్రాంతంలో ఉన్న ఆలహాబాద్లోని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని కూడా రెడీ చేస్తున్నారు. అయితే.. ప్రియాంక మాత్రం ఎక్కువగా లక్నోలోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
వచ్చి రావడంతోనే సెంటిమెంట్ దెబ్బ..! ఇందిరా వాడిన కార్యాలయం నుంచే ప్రియాంక అడుగులు..!!
లక్నోలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని నెహ్రూ భవన్గా వ్యవహరిస్తారు. దీన్ని 1979లో ఇందిరాగాంధీ ప్రారంభించారు. తర్వాత అప్పుల కారణంగా ఈ భవనాన్ని వేలం వేయగా కాంగ్రెస్ నేత కిద్వాయ్ కొనుగోలు చేసి కాంగ్రెస్ కార్యాలయంగానే ఉపయోగిస్తున్నారు. లక్నో వచ్చిన ప్రతిసారీ ఇదే భవనలోని ఒక గది నుంచి ఇందిరాగాంధీ సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. అలాగే ప్రియాంక తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్గాంధీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ కార్యాలయాన్ని సందర్శించేవారు. ఆయన హత్యకు గురికావడానికి కొన్ని రోజుల ముందు కూడా ఇక్కడికి వచ్చి వెళ్లారని యూపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు గుర్తు చేస్తుంటారు.
యూపీ రాజకీయాల్లో ప్రియాంక ప్రభావం..! కాంగ్రెస్ కు అనుకూలమంటున్న నేతలు..!!
ఇక అప్పట్లో నానమ్మ ఉపయోగించిన గదినే ఇప్పుడు ప్రియాంక కోసం కేటాయించబోతున్నారు. అందుకు గదికి రంగులు వేసి అన్ని ఏర్పాట్లు ఉండేలా సిద్ధం చేస్తున్నారు. ప్రియాంక గాంధీ ఫిబ్రవరి 4న లేదా 10వ తేదీన బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అదే రోజు కుంభమేళాను సందర్శించి పవిత్రస్నానం ఆచరిస్తారని కూడా యూపీ నేతలు చెబుతున్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, యూపీ పశ్చిమ విబాగం ఇన్ఛార్జి జ్యోతిరాదిత్య సింధియా కూడా హాజరుకానున్నారు. మొత్తానికి ఇందిరా గాంధీ మార్క్ రాజకీయంతో ఉత్తర ప్రదేశ్ లో ప్రియాంక హల్ చల్ చేయబోతున్నారు. మరి ప్రియంక ప్రభావం యూపీ రాజకీయాల పై ఎంతగా పనిచేస్తుందో చూడాలి.