ప్రియాంక పోటీ అక్కడనుండి.. ఆయన మీదే..! తగ్గేది లేదంటున్న ఇందిర వారసురాలు..!!
హైదరాబాద్ : దేశ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జాతీయ నేతలు పదునైన మాటలతో, చురుకైన వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మళ్లీ వారణాసి నుంచే బరిలోకి దిగుతున్నప్రధాని మోదీకి పోటీగా ప్రియాంక గాంధీ కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. రాయబరేలీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రియాంక తన ఉద్దేశాన్ని బయటపెట్టారు. మీరు ఇక్కడి నుంచే పోటీ చేయాలంటూ కార్యకర్తలు చేసిన నినాదాలకు ప్రియాంక స్పందిస్తూ.. 'వారణాసి నుంచి వద్దా' అని ప్రశ్నించారు. 'మీ ఇష్టం ఎక్కడి నుంచైనా ఓకే' అని కార్యకర్తలు అనడంతో 'వారణాసి నుంచి పోటీ చేయనా?' అని తిరిగి ప్రశ్నించారు.
ప్రియాంక చేసిన తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. వారణాసి ఎన్నికలు మోదీ వర్సెస్ ప్రియాంకగా మారడం ఖాయమని చెబుతున్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమని రెండు రోజుల క్రితం ప్రకటించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి (తూర్పు యూపీ) ప్రియాంక గాంధీ ఇప్పుడు మోదీపై బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రియాంక వ్యాఖ్యలను బీజేపీ కూడా స్వాగతించింది.
వారణాసి నుంచి పోటీ చేసి తొలి పోటీలోనే ఓడిన నేతగా రికార్డులకెక్కొచ్చంటూ ఎద్దేవా చేసింది. బీజేపి వ్యాఖ్యలను ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ హుందాగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతికూల వ్యాఖ్యలను, పరిస్థితులను మోదీ ఎలా తనకు అనుకూలంగా మలచుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం.