సస్పెన్స్కు తెరదించిన ప్రియాంక !.. రాహుల్ ఆదేశిస్తే మోడీపై పోటీకి సిద్ధమని ప్రకటన!
ఢిల్లీ : రాజకీయాల్లో దూకుడు పెంచిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఎన్నికల్లో పోటీపై నెలకొన్న సస్పెన్స్కు తెరదించారు. మోడీకి ప్రత్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే పార్టీ ప్రెసిడెంట్ ఆదేశిస్తే మాత్రమే తాను పోటీ చేస్తానని బాల్ను రాహుల్ గాంధీ కోర్టులోకి నెట్టారు.
మళ్లీ నోరు జారిన సాధ్వీ!.. బాబ్రీని కూల్చినందుకు గర్వంగా ఉందన్న ప్రగ్యా ఠాకూర్!
వారణాసి నుంచి పోటీకి సిద్ధం
లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి ఆమెను బరిలో దింపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కేరళలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రియాంక గాంధీ తాజాగా ఈ అంశంపై స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశిస్తే మోడీకి ప్రత్యర్థిగా వారణాసి నుంచి లోక్సభ బరిలో దిగుతానని స్పష్టం చేశారు.
రాహుల్ నిర్ణయంపై ఆసక్తి
2014 లోక్సభ ఎన్నికల్లో మోడీపై పోటీ చేసిన ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈసారి ఎన్నికల్లో మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలో దిగాలని నిర్ణయించారు. ఎస్పీ బీఎస్పీ కూటమి ఈ స్థానం నుంచి తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ప్రియాంక వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రియాంక పోటీ పార్టీశ్రేణుల పట్టు
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ యూపీపై ప్రత్యేక దృష్టి సారించారు. సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. రాజకీయ అరంగేట్రం నుంచి ఆమె ఎన్నికల్లో పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో మోడీపై పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ప్రియాంక వారణాసి నుంచి ఎందుకు బరిలో దిగకూడదని బదులీయడం హాట్ టాపిక్గా మారింది. తాజాగా పోటీకి సిద్ధమంటూ ఆమె చేసిన ప్రకటనతో లోక్సభ బరిలో దిగడం ఖాయమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.