పని మొదలు పెట్టిన ప్రియాంక..! ప్రాధాన్యత సంతరించుకున్న రాహుల్తో రాజకీయ భేటీ..!!
ఢిల్లీ/ హైదరాబాద్ : విదేశాల నుండి వచ్చి రాగానే ప్రియాంకా గాంధీ పని మొదలు పెట్టారు. ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ తో సమావేశం నిర్వహించి దేశ రాజకీయాల గురించి సుధీర్గంగా చర్చించారు. బెంగాల్ లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఉత్తర ప్రదేశ్ రాజకీయాల గురించి లోతుగా చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయంగా ఎలా బలపడాలనే అంశం పై వ్యూహాలు రచించినట్టు సమాచారం.
ప్రియాంక మార్క్ రాజకీయం..! పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం..!!
విదేశాల్లో ఉన్న ప్రియాంక గాంధీ ఢిల్లీకి చేరగానే రాజకీయమంతనాల్లో మునిగిపోయారు. ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రియాంక గాంధీ భారత్కు తిరిగి వచ్చారు. ఆమె ఈ రోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. యూపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడమే కాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై సుధీర్గంగా చర్చించినట్టు తెలుస్తోంది.
దేశ రాజకీయాలపై ప్రియాంక ఆసక్తి..! పార్టీ బలోపైతం పై ద్రుష్టి..!!
ఇక ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్ పశ్చిమ విభాగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న జ్యోతిరాదిత్య సింధియాతో పాటు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ యూపీకి చెందిన పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో ఫోన్ ద్వారా పలువురు ప్రముఖుల అభిప్రాయాలను కూడా సేకరించారు. యూపీలో మళ్లీ పార్టీకి జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రియాంక నేత్రుత్వంలో కార్యచరణ పొందిస్తోంది.
వచ్చే ఎన్నికలే టార్గెట్..! ట్రంప్ కార్డ్ కానున్న ప్రియాంక, రాహుల్..!!
కాంగ్రెస్ పార్టీలో చరిష్మా నింపడంలో భాగంగా ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలక బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఉత్తరప్రదేశ్ తూర్పు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న రెండు నియోజకవర్గాలు తూర్పు పరిధిలోనే ఉండడం గమనార్హం. 22 ఎంపీ స్థానాలున్న ఈ ప్రాంతంలో 2014లో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 8.4శాతం ఓట్లు మాత్రమే సాధించింది.
25 బహిరంగ సభలు..! కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం నింపనున్న ప్రియాంక..!!
ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకు వచ్చిన పార్టీ, యూపీ ని ముందుగా టార్గెట్ చేస్తోంది. ప్రియాంకతో యూపీలో 13 బహిరంగ సభలు నిర్వహించాలని తొలుత నిర్ణయించింది. అయితే స్థానిక నేతల వత్తిడి మేరకు సభల నిర్వహించే సంఖ్యను 25కు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయాలనీ నిర్ణయించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను సైతం రచిస్తున్నారు. అలాగే ఈ నెల 9న జరగనున్న పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశానికీ ప్రియాంక హాజరుకానున్నారు.