ఖురేషిపై రివార్డులు: పది చెప్పు దెబ్బలకు రూ. లక్ష నజరానా
లక్నో: ఫ్రాన్స్లోని చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయ ఉగ్రవాద దాడిని సమర్ధించి... పరారీలో ఉన్న బహుజన్ సమాజ్వాదీ పార్టీ మాజీ ఎంపీ హజీ యాకుబ్ ఖురేషీని పట్టిస్తే పెద్ద మొత్తంలో బహుమతి అఁదజేస్తామని ఉత్తరప్రదేశ్లోని పలు సంస్ధలు ప్రకటించాయి.
పోలీసులు కళ్లు గప్పి పరారీలో ఉన్న ఖురేషిని పట్టించిన వారికి ఉత్తరప్రదేశ్లోని ఓ హిందూ సంస్ధ రూ. 100 కోట్ల బహుమతిని ప్రకటించింది. దీంతో పాటు ఉత్తరప్రదేశ్ శివసేన పార్టీ నేత ఏకంగా ఒక అడుగు ముందుకేసి ఖురేషిని పది చెప్పు దెబ్బలు కొట్టే వారికి రూ. లక్ష నజరానా ఇస్తామని అన్నాడు.
ఇలాంటి వ్యక్తులను వెంటనే కటకటాల వెనక్కి పంపించాలని ముజఫర్నగర్ జిల్లా శివసేన అధ్యక్షుడు యోగేంద్ర శర్మ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఠాకూర్ కూడా రూ. 20,000వేల నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఖురేషిని పట్టుకున్న పోలీస్ టీమ్కి ఈ రూ. 20 వేల ఇస్తానని ప్రకటించారు.
ఫ్రాన్స్లోని ప్యారిస్లో చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపైన దుండగుల దాడిని సమర్థిస్తూ ఉగ్రవాదులకు రూ. 51 కోట్ల బహుమతిని అందజేస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తర ప్రదేశ్ మాజీ పార్లమెంటు సభ్యుడు, బీఎస్పీ నేత యాకుబ్ ఖురేషీ పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
పత్రిక కార్యాలయ ఘటనలో దాడికి పాల్పడిన వారి పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మహమ్మద్ ప్రవక్త వ్యంగ్య చిత్రాలు గీస్తే ప్యారిస్ పాత్రికేయులు, వ్యంగ్య చిత్రకారుల మాదిరి మరణం కొని తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయన వ్యాఖ్యల పైన బీజేపీ, ఇతర పార్టీలు భగ్గుమన్నాయి. కేసు నమోదు తర్వాత నుంచి ఆయన తప్పించుకు తిరుగుతున్నారు.