కర్ణాటక స్పీకర్ చేతిలో బీజేపీ భవిష్యత్తు: ఆర్ వీ దేశ్ పాండే, ఉమేష్ కత్తి పోటీ, గవర్నర్ ఆస్త్రం !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప శనివారం విదాన సౌధలో బలపరీక్షలో మెజారిటీ శాసన సభ్యుల మద్దతు నిరూపించుకోవాలి. బీఎస్. యడ్యూరప్ప బలపరీక్షలో విజయం సాధించుకునే విషయంలో ఇప్పుడు తాత్కాలిక స్పీకర్ (ప్రోటమ్ స్పీకర్) కీలకపాత్ర పోషించనున్నారు. అయితే బీజేపీ ఒకరిని, కాంగ్రెస్ ఒకరిని తాత్కాలిక స్పీకర్ గా ప్రతిపాధించింది. గవర్నర్ ఎవరిని తాత్కాలిక స్పీకర్ గా నియమిస్తారు అనే ఉత్కంఠ మొదలైయ్యింది.
తాత్కాలిక స్పీకర్
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసి 28 గంటలు అయ్యింది. బీజేపీకి 104 మంది శాసన సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. బీఎస్. యడ్యూరప్ప బీజేపీ ప్రభుత్వాన్ని బలపరీక్షలో నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైయ్యింది. యడ్యూరప్ప బలపరీక్ష నిరూపించుకోవడానికి శాసన సభలో స్పీకర్ ఆయనకు అనుకూలంగా వ్యవహరించాలి. కర్ణాటక తాత్కాలిక స్పీకర్ ఎవరు, ఆయన బీజేపీకి అనుకూలంగా ఉంటారా అనే ఉత్కంఠ మొదలైయ్యింది.
బీజేపీకి ఒకే చాన్స్
కర్ణాటక శాసన సభ సమావేశం శనివారం ఏర్పాటు అయిన తరువాత ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మెజారిటీ శాసన సభ్యుల మద్దతు చూపించాలి. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ 112 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైయ్యింది. అయితే కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు ఎంత మంది యడ్యూరప్పకు మద్దతు ఇస్తారో అనే విషయం అర్థం కావడం లేదు.
ఆర్ వీ దేశ్ పాండే
అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేని చట్టప్రకారం తాత్కాలిక స్పీకర్ గా నియమించే అవకాశం ఉంది. సీనియారిటీ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆర్.వీ. దేశేపాండ్ ఉన్నారు. ఆర్ వీ. దేశ్ పాండే తాత్కాలిక స్పీకర్ అయితే అసెంబ్లీలో యడ్యూరప్ప మెజారిటీ నిరూపించుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, క్రాస్ ఓటింగ్ కు అవకాశం ఉండదని బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
ఉమేష్ కత్తి
బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు ఉమేష్ కత్తిని తాత్కాలిక స్పీకర్ గా నియమించాలని ఆ పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఆర్ వీ. దేశ్ పాండే తాత్కాలిక స్పీకర్ గా ఉంటే బలపరీక్ష సమయంలో యడ్యూరప్ప ప్రభుత్వానికి సహకరించరని బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
గవర్నర్ చేతిలో అస్త్రం
కాంగ్రెస్ పార్టీ సూచిస్తున్న ఆర్ వీ. దేశ్ పాండేని తాత్కాలిక స్పీకర్ చెయ్యాలా, బీజేపీ సూచించిన ఉమేష్ కత్తిని తాత్కాలిక స్పీకర్ చెయ్యాలా అనే నిర్ణయం కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా తీసుకుంటారు. శుక్రవారం సాయంత్రంలోపు గవర్నర్ వాజుబాయ్ వాలా తాత్కాలిక స్పీకర్ ఎవరు అనే విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.