రిపోర్టులో ఏముంది: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ పై సుప్రీంకు సీవీసీ నివేదిక
ఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశ అత్యున్నత విచారణ సంస్థ సీబీఐలో గందరగోళ వాతావరణ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్తానాల మధ్య నెలకొన్న విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో సీవీసీని నివేదిక ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సీవీసీ జరుగుతున్న పరిణామాలపై విచారణ చేసి ప్రాథమిక నివేదికను సీల్డు కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది.
సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, ఎస్కే కౌల్తో కూడిన ధర్మాసనం సీల్డ్ కవర్ను స్వీకరించింది. అలోక్ వర్మతో పాటు మరో ఎన్జీఓ సంస్థ వేసిన పిటిషన్లను నవంబర్ 16న విచారణ చేస్తామని పేర్కొంది. మరోవైపు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా ఉన్న నాగేశ్వరరావు కూడా తాను అక్టోబర్ 23న బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను తీసుకున్న నిర్ణయాలపై ఓ నివేదికను న్యాయస్థానం ముందు ఉంచారు. సీవీసీ విచారణను సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో జరిగిందని ఆ విచారణ నవంబర్ 10తో పూర్తయిందని సాల్సిటర్ జనరల్ తుషార్ మెహత చెప్పారు.
ఆదివారం కూడా రిజిస్ట్రీ తెరిచే ఉంది అలాంటప్పుడు నివేదిక ఎందుకు ఆదివారం రోజే అందజేయలేదని ఛీఫ్ జస్టిస్ సాల్సిటర్ జనరల్ను ప్రశ్నించారు. అయితే ఇందుకు సాల్సిటర్ జనరల్ క్షమించాల్సిందిగా కోరారు. రిపోర్టు సమర్పించడంలో తమవల్లే జాప్యం జరిగిందని కోర్టుకు తెలిపారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై అదే శాఖ స్పెషల్ డైరెక్టర్ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని అక్టోబర్ 26 సర్వోన్నత న్యాయస్థానం సీవీసీకి ఆదేశాలు జారీ చేసింది. నివేదికను సమర్పించేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది.