బీహార్లో కాంగ్రెస్కు కొత్త తలనొప్పి... నేతల రాకతో నో వేకెన్సీ బోర్డు
ఢిల్లీ: గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు ప్రధాన రాష్ట్రాల్లో పాగా వేయడంతో ఆ పార్టీలోకి చేరేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం బీహార్లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీ నేతలు ఆసక్తి చూపడంతో ఇప్పటికే హౌజ్ఫుల్ అయ్యిందంటూ కాంగ్రెస్ పార్టీ బోర్డ్ పెట్టేసిందట. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ, ఎన్సీపీలలోని నేతలు ఆపార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వైపు వారంతా చూస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్లోకి తరలివస్తున్న ఇతరపార్టీల నేతలు
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో ఇతర రాష్ట్రాల్లో రాజకీయసమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా బీహార్లో ఇతర పార్టీ నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అంతేకాదు ఉత్తర్ప్రదేశ్ తర్వాత బీహార్కు అంత ప్రాధాన్యత ఇస్తామని స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం పాట్నా సభలో చెప్పడంతో ఇతర పార్టీ నాయకులంతా హస్తం పార్టీకి షేక్హ్యాండ్ ఇచ్చి ఆ పార్టీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలిపేందుకు అష్టకష్టాలు పడుతున్న కాంగ్రెస్కు బీహార్లో మాత్రం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారు చాలామందే ఉన్నారు. అయితే గతేడాది వరకు బీహార్లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం కోసం జల్లెడ పట్టినా దొరకని పేర్లు... ఇప్పుడు మూడురాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత వద్దన్నా నేతలు హస్తం పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఓ రకంగా బీహార్లో కాంగ్రెస్కు మంచి రోజులు వచ్చాయనే చెప్పవచ్చు.
కాంగ్రెస్లో చేరేందుకు శతృఘ్నసిన్హా, కీర్తి ఆజాద్ ఆసక్తి
ఇక కాంగ్రెస్లో చేరాలనుకునే రాజకీయనాయకుల జాబితాలో మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్, ప్రముఖ నటుడు శతృఘ్నసిన్హా ఉన్నారు. వీరిద్దరూ బీజేపీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. ఇక బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, అనంత్ సింగ్, జన్అధికార్ పార్టీ లీడర్ పప్పు యాదవ్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇందులోని నాయకుల్లో చాలావరకు అగ్రకులాలకు చెందినవారు కావడం విశేషం. రిషి మిశ్రా కీర్తి ఆజాద్లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు కాగా... ఉదయ్ సింగ్, లవ్లీ ఆనంద్లు రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందినవారు. అనంత్ సింగ్ భూమిహార్ సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. శతృఘ్నసిన్హా కయాస్త్ సామాజికవర్గానికి చెందినవారు కావడం విశేషం.
అగ్రకులాలకు చెందిన ఈ నాయకులంతా కాంగ్రెస్లో చేరేందుకు మొగ్గు చూపుతుండటంతో అక్కడి ప్రాంతీయపార్టీల నేతలు కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలు ఒక్కింత ఇబ్బందులకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఆర్జేడీ కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉండగా... ఇలాంటి అగ్రకులాలకు చెందిన నేతలు కాంగ్రెస్లోకి చేరితే ఆర్జేడీలో ఉన్న ఓబీసీలు, దళితులు నిరాశకు గురయ్యే అవకాశం ఉందని ఆర్జేడీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సీట్ల పంపకాల విషయంలో గందరగోళం
మరోవైపు అందరూ కాంగ్రెస్లో చేరితే సీట్ల పంపకాల్లో కూడా గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్లోకి రావాలనుకుంటున్న నేతలంతా లోక్సభ టికెట్ ఆశిస్తున్నారు. అలా అయితే మిత్ర పక్షంగా ఉన్న ఆర్జేడీకి ఇది కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే అనంత్ సింగ్ ముంగర్ లోక్సభ స్థానం నుంచి తాను బరిలోకి దిగనున్నట్లు ప్రకటించాడు. అయితే ముంగర్లో ఆర్జేడీ పోటీలో గతసారి నిలిచింది. అయితే ఇప్పటికే ముంగర్లో అనంత్ సింగ్ను బరిలో దింపేందుకు ఆర్జేడీ అంగీకరించిందని ఆ పార్టీనేత తేజస్వీ యాదవ్ వెల్లడించాడు. అంతేకాదు లవ్లీ ఆనంద్ను షియోహర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయిస్తున్నామని అక్కడ కూడా గతంలో ఆర్జేడీ అభ్యర్థి పోటీ చేశారని గుర్తు చేశారు. ఇక కీర్తి ఆజాద్ దర్భాంగా నుంచి పోటీచేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
ఇక జాప్ నేత పప్పుయాదవ్ కూడా కాంగ్రెస్కు మద్దతు తెలుపుతూ పాట్నాలో జరిగిన రాహుల్ గాంధీ సభను సక్సెస్ చేయడంలో తన పాత్ర పోషించారు. ఇక పప్పు యాదవ్ మాధేపురా నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇదే సీటు నుంచి శరద్ యాదవ్ కూడా పోటీచేయాలని భావిస్తున్నారు. ఇక మరో ఇద్దరు శతృఘ్నసిన్హా, ఉదయ్ సింగ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇద్దరూ కాంగ్రెస్ కోటాలో కేటాయించిన సీట్లనుంచే పోటీచేసే అవకాశం ఉంది.