ఇక అవినీతిపరులకు మరిన్ని కష్టాలు : వెంకయ్యనాయుడు
అవినీతిపరులకు ఇక మరిన్ని కష్టాలు మొదలైనట్లేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: అవినీతిపరులకు ఇక మరిన్ని కష్టాలు మొదలైనట్లేనని, పెద్దనోట్ల రద్దు నిర్ణయం అవినీతి కుంభకోణానికి ఇచ్చిన టీకా మందులాంటిదని, దాని ప్రభావం మెల్లగా తెలుస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అవినీతిని తగ్గించాలంటే నగదు లావాదేవీలు తగ్గించడం ముఖ్యమని ఆయన అన్నారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ 50 రోజుల గడువు నేటితో ముగుస్తుందని, కానీ అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మాత్రం ఈ రోజే అసలైన ప్రారంభం అని అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు చేసిన అన్ని రకాల ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు.
పదేళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీయే దేశంలో పేరుకుపోయిన నల్లదానానికి బాధ్యత తీసుకోవాలని వెంకయ్య అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం పెద్దనోట్ల రద్దు ప్రభావం నుంచి దేశ ప్రజలకు ఊరట కలిగిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
దేశ ప్రజలు ఒక మహాక్రతువు నిర్వహించారని, దీంతో బ్యాంకుల బయట తిరుగుతున్న డబ్బంతా వచ్చి బ్యాంకుల్లో పడిందన్నారు. అయితే బ్యాంకుల్లో జమ అయినదంతా నల్లధనమా, తెల్లధనమా అనేది అన్ని స్థాయిల్లో పరిశీలన జరిగిన తర్వాతే తేలుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు.
ఇక నిజాయితీ పరులకు సమస్యలు, ఇబ్బందులు తగ్గుతాయని.. అవినీతి పరులకు మాత్రం సమస్యలు మరింత పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ఒక సీ (కరప్షన్)ని కాపాడేందుకు నాలుగు సీ ( కాంగ్రెస్, కమ్యూనిస్టు, కమ్యూనల్, క్యాస్టియెస్ట్)లు ఒక్కటయ్యాయంటూ ఎద్దేవా చేశారు.