67 మంది ఎమ్మెల్యేలు ప్రభావం చూపలేదు, తగ్గిన ఓటు షేర్, కేజ్రీ ఆందోళన
న్యూఢిల్లీ : ఎన్నికల ఫలితాలతో ఢిల్లీ కోట ఉలిక్కిపడింది. 7 లోక్సభ స్థానాల్లో బీజేపీ క్లీన్స్వీప్ చేయడం ఆప్ పార్టీని కలవరానికి గురిచేస్తోంది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని .. దానికి అనుగుణంగా పనిచేయాలని పార్టీ నేతలకు హితవు పలికారు.
వచ్చే ఏడాది పోల్ (కేజ్రీవాల్)
వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉండగా .. 2015లో ఆప్ 67 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. కానీ అధికారం చేపట్టాక ప్రజల ఆదరణ క్రమంగా కోల్పోతూ వస్తోంది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల్లోనూ ఆప్ ప్రభావం చూపలేకపోయింది. ఢిల్లీ అసెంబ్లీలో 67 స్థానాల ప్రాతినిధ్యం ఆప్ ... ఒక్క లోక్ సభ సీటు గెలవకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
వాట్సప్ సందేశం (కేజ్రీవాల్)
ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ వాట్సప్లో సందేశం పంపించారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నిత్యం ప్రజలతో మమేకం కావాలని .. చిన్న చిన్న మీటింగ్లు నిర్వహించాలని కోరారు. వారు తెలిపే తప్పులను గమనించి .. మళ్లీ చేయమని భరోసా కల్పించాలని స్పష్టంచేశారు. ఎన్నికల ఫలితాల ఆధారంగా కేజ్రీవాల్ టీం ఏర్పాటు చేశామని .. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీ టీం పోటీచేస్తుందే తప్ప .. వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు, అభ్యర్థులు పోటీలో ఉండరని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు.
హజారే ప్రభావంతో .. (అన్నాహజారే)
2013లో అవినీతికి వ్యతిరేకంగా సామాజిక వేత్త అన్నా హజారే ఉద్యమం చేపట్టారు. ఆ తర్వాత హజారే అనుచరుడు అరవింద్ కేజ్రీవాల్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటుచేసిన వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆప్ 28 సీట్లు సాధించి .. బీజేపీ తర్వాత స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 8 మంది ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయితే ఢిల్లీ అసెంబ్లీ లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో నిరసిస్తూ 49 రోజుల తర్వాత కేజ్రీవాల్ సీఎం పదవీకి రాజీనామా చేశారు.
ఆప్ హవా (కేజ్రీ, మోదీ)
2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మోదీ హవాలో కూడా ఆప్ 32.90 ఓటు షేర్ సాధించగలిగింది. బీజేపీ 7 లోక్ సభ స్థానాలు సాధించగా .. ఆప్ రెండో స్థానంతో ఓట్లు సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ మూడోస్థానానికి పరిమితమైంది. కానీ 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయదుందుబి మోగించింది. 67 సీట్లు సాధించి బీజేపీకి గట్టి దెబ్బ కొట్టింది. బీజేపీ 3 సీట్లకు పరిమితం కాగా .. కాంగ్రెస్ పార్టీ ఖాత తెరవలేదు. కానీ తర్వాత ఆప్ తన ప్రభను కోల్పోతూ వస్తోంది. 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు షేర్ 26 శాతానికి పడిపోయింది. 2019 ఎన్నికల్లో అది 18.1 శాతానికి చేరడంతో ఆప్ అధినేతలో టెన్షన్ మొదలైంది. మూడోస్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ 22.5 శాతానికి చేరడం కూడా కేజ్రీ ఆందోళనకు మరో కారణం.
బీజేపీ బలోపేతం .. తగ్గిన ఆప్ ఓటు శాతం (కేజ్రీ, రాహుల్)
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లను బీజేపీ దక్కించుకుంది. నార్త్ వెస్ట్ ఢిల్లీలో అయితే ఏకంగా 60.49 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధిక ఓటు షేర్ చాందినీ చౌక్లో 29.67 శాతం నమోదైంది. ఆప్ హైయెస్ట్ ఓటు షేర్ 26.35 శాతం సౌత్ ఢిల్లీలో దక్కింది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఒక్క నియోజకవర్గంలో కూడా ఆప్ ముందంజలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 65 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉండటం ఆ పార్టీ ఓటు షేర్కు దోహదపడింది.