శబరిమల కోసం కొత్త చట్టం చేయండి: కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు, జనవరి 3లోగానే..
న్యూఢిల్లీ: శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టం రూపొందించాలని సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరి 3వ తేదీలోగా కొత్త చట్టం తీసుకురావాలని స్పష్టం చేసింది. కేరళలోని ఇతర ఆలయాలతోపాటు చట్టం తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
శబరిమల దర్శనానికి భక్త శునకం: 480 కి.మీలు నడిచి భగవంతుడి సన్నిధికి
కొత్త చట్టం తీసుకురావాలంటూ..
పండలం రాజ కుటుంబం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం బుధవారం అయ్యప్ప ఆలయం నిర్వహణ కోసం ప్రత్యేక కొత్త చట్టం తీసుకురావాలంటూ కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఏడుగురు సభ్యుల ధర్మాసనంకు..
అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన సమీక్ష పిటిషన్లై ఇటీవల సుప్రీంకోర్టు విచారించిన విషయం తెలిసిందే. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా ఇతర మతపరమైన అంశాలను ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మసనం పరిశీలిస్తుందని గత గురువారం సుప్రీంకోర్టు పేర్కొంది. ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మసనానికి ఈ వ్యవహారాన్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
స్టే ఇవ్వకపోవడంతో.. కేరళ ప్రభుత్వం..
కానీ, గతంలో ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే విధించలేదు. అయితే, భద్రతా కారణాలరీత్యా 10 నుంచి 50ఏళ్ల లోపు మహిళలను ఆలయంలోకి అనుమతించకుండా కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాక, ఆ వయస్సులోపు మహిళలు శబరిమలకు వస్తే వారి రక్షణ తమ బాధ్యతని స్పష్టం చేసింది.
మహిళలను వెనక్కి పంపిస్తున్నారు..
ఈ నేపథ్యంలో శబరిమలకు మహిళలు రాలేదు. వచ్చిన కొందరిని ఆలయంలోకి వెళ్లకుముందే తిరిగి పంపించారు. మంగళవారం కుటుంబసభ్యలతో వచ్చిన ఓ 12ఏళ్ల బాలికను పంబ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కాగా, వార్షిక మండల పూజల నిమిత్తం గత శనివారం శబరిమల ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే.