మరోసారి వార్తల్లోకి జామియా యూనివర్శిటీ: కీలక మార్పు: ప్రొ-వైస్ ఛాన్సలర్ నియామకం..!
న్యూఢిల్లీ: జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం. పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు ఇది. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన సందర్భంగా కొద్ది రోజుల కిందట దేశ రాజధానిలో చోటు చేసుకున్న అల్లర్లు, హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఈ యూనివర్శిటీ పేరు మారుమోగిపోయింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా యూనివర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు, ఆందోళనలు, బైఠాయింపులను నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ యూనివర్శిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కొత్తగా ఈ యూనివర్శిటీకి ప్రొ-వైస్ ఛాన్సలర్ ను నియమితులయ్యారు. ప్రొఫెసర్ ఇల్యాస్ హుస్సేన్ ను ప్రొ-వైస్ ఛాన్సలర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన అదే యూనివర్శిటీలో ఎడ్యుకేషనల్ స్టడీస్ విభాగాధిపతిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సలర్ నజ్మా అఖ్తర్ వైస్ ఛాన్సలర్ గా కొనసాగుతున్నారు. ప్రొఫెసర్ ఇల్యాస్ హుస్సేన్ ను ప్రొ-వైస్ ఛాన్సలర్ గా నియమించారు.
విద్యార్థులను అదుపు చేయడానికి ఢిల్లీ పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా యూనివర్శిటీ క్యాంపస్ లోకి ప్రవేశించి, హాస్టళ్లలో చొరబడి విద్యార్థులపై లాఠీఛార్జీ చేసిన ఉదంతంపై నజ్మా అఖ్తర్ బహిరంగంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు అనుమతులు లేకుండా క్యాంపస్ లోకి ప్రవేశించారని, వారిపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేయాలంటూ అప్పట్లో నజ్మా అఖ్తర్ డిమాండ్ చేశారు. ఆమె ఈ డిమాండ్ చేసిన కొద్దిరోజులకే.. ప్రొ-వీసీ నియమితులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.