గో రక్షక దాడులు: అమిత్ షా ఎదురుదాడి, నిజమెంత?
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా గో రక్షణ పేరిట, బీఫ్ తింటున్నారనే పేరుతో ముస్లిం మైనారిటీలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారిపై దాడులు సాగుతున్నాయి. గో రక్షణ పేరిట స్వీయ ప్రకటిత వ్యక్తులు పలు చోట్ల జరిపిన దాడుల్లో బాధితులు మరణిస్తున్నారు.
కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం దేశంలో ఉన్మాదుల దాడులు గత ప్రభుత్వాల హయాంలోనే ఎక్కువగా జరిగాయని ఎదురు దాడికి దిగారు. దాడులు చేయడం తీవ్రమైన అంశమేనని పేర్కొన్నారు. కానీ ఇటువంటి ఘటనలు 2011, 2012, 2013ల్లోనే ఎక్కువగా జరిగాయి అని తెలిపారు. కానీ దీనికి ఉదాహరణలు చూపలేకపోవడం గమనార్హం. 2015లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దాద్రి నుంచి ఇటీవల కర్ణాటకలోని ఉడిపి వరకు గోరక్షకుల పేరిట దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా జరిగిన దాడుల గురించి పరిశీలిద్దాం..
దాద్రిలో ఇలా అఖ్లాఖ్ కుటుంబంపై దాడి
గోమాంసం కలిగి ఉన్నాడన్న అనుమానంతో 2015 సెప్టెంబర్ 28వ తేదీన ఉత్తరప్రదేశ్ దాద్రిలో మహ్మద్ అఖ్లాఖ్ అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. గో రక్షణ పేరిట జరిపిన దాడిలో అఖ్లాక్ మరణించాడు. కానీ దేశంలో దాద్రి ఘటనే మొదటి కాదు. అదే ఏడాది రాజస్థాన్ రాష్ట్రంలో అబ్దుల్ ఖురేషి అనే వ్యక్తి మటన్ విక్రయిస్తున్నట్లు క్రూరంగా కొట్టారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు గో రక్షణ పేరిట దాడులకు నిదర్శనంగా నిలిచాయి.
దక్షిణ భారతంలోనూ దాడుల పరంపర
దక్షిణ భారతం కూడా ఇటువంటి దాడులకు ప్రాతిపదికగా మారుతున్నది. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో కార్జికే గ్రామంలో గోవులను తరలిస్తున్నారన్న సాకుతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్త ప్రవీణ్ పూజారి (29)ని తీవ్రంగా హిందూ జాగారణ్ వేదిక (హెచ్జేవీ) కార్యకర్తలు తీవ్రంగా కొట్టడంతో మరణించాడు.
రాజస్థాన్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో ఇలా..
రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లాలోని బిర్లోకా గ్రామంలో 2015 మే 30వ తేదీన అబ్దుల్ గఫార్ ఖురేషి అనే మటన్ వ్యాపారిని అల్లరిమూక కర్రలతో, ఐరన్ రాడ్లతో తీవ్రంగా కొట్టాడు. ఆ మరుసటి రోజు మరణించాడు. జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ గ్రామంలో 2015 అక్టోబర్ తొమ్మిదో తేదీన జాహిద్ భట్ అనే వ్యక్తి గోవులు రవాణా చేస్తున్నారన్న సాకుతో అతివాద సంస్థకు చెందిన అల్లరిమూక అతడు తీసుకెళ్తున్న ట్రక్పై పెట్రోల్ బాంబులు విసిరారు. వాస్తవంగా జహీద్ భట్ బొగ్గు రవాణా చేస్తున్నారు. పెట్రోల్ బాంబులతో తీవ్రంగా గాయపడ్డాడు.
హిమాచల్లో స్మగ్లింగ్ అనుమానంతో..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సరహన్ గ్రామంలో గోవులు స్మగ్లింగ్ చేస్తున్నాడన్న పేరుతో ఒక ఉత్తరప్రదేశ్ వాసిని తీవ్రంగా కొట్టాడు. దీంతో అతడు, అతడి నలుగురు సిబ్బంది తీవ్రంగా కొట్టడంతో వారు మరణించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖిర్కియా పరిధిలో కుషి నగర్ ఎక్స్ ప్రెస్ రైల్వే స్టేషన్ వద్దకు వచ్చిన ముస్లిం జంటపై దాడి చేశారు. వారి వద్ద 'బీఫ్' ఉన్నదన్న అనుమానంతో వారి సామాగ్రి తనిఖీ చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని లాతేహర్ జిల్లాలో ముస్లిం గో రవాణా వ్యాపారులు గోవులను స్మగ్లింగ్ చేస్తున్నారన్న సాకుతో 2016 మార్చి 23వ తేదీన దాడి చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంద్సౌర్లో ఇద్దరు ముస్లిం మహిళలను 2016 జూలై 27వ తేదీన దాడి చేశారు. వారు 'బీఫ్' తీసుకెళ్తున్నారన్న అనుమానంతో దాడి చేశారు.
రాజస్థాన్లో ఇలా భజరంగ్ దళ్, శివసేన
2016 అక్టోబర్ ఆరో తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్సామద్లో రెల్మగ్రా గ్రామంలో గిరిజనులపై భజరంగ్ దళ్, శివసేన కార్యకర్తలు దాడి చేశారు. సంతలో ఒక ఆరు ఎడ్లను కొనుగోలు చేసుకుని వస్తుండగా దాడి చేశారు. గత మార్చి 21వ తేదీన రాజస్థాన్ రాజధాని హయత్ రబ్బానీలో 'బీఫ్' సరఫరా చేస్తున్నారన్న సాకుతో ఆరు గంటల పాటు గోరక్షకుల పేరిట దుండగులు హోటల్ ను ఆరు గంటల పాటు సీల్ చేశారు.
ఒడిశాలో ఇలా పాలు రవాణా దారులపై
గత మే 26వ తేదీన ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరంలో గో రక్షకుల పేరిట దుండగులు రైల్వే స్టేషన్లో పాలు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. గత నెల 10వ తేదీన ఢిల్లీలోని ఫరీదాబాద్ వద్ద ఇద్దరు గోవుల రవాణాదారులపైనా దాడికి పాల్పడ్డారు. గత నెల 12న రాజస్థాన్ రాష్ట్రం బార్మార్లోని తమిళనాడు పశు సంవర్ధకశాఖ అధికారులపై పశువులు అక్రమ రవాణాచేస్తున్నారన్న ఆరోపణపై 50 మంది దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల రంజాన్ షాపింగ్ చేసుకుని హర్యానాలోని సొంత గ్రామానికి వెళుతున్న జునైద్పై రైలులో కత్తులతో దాడి చేసి చంపారు.