బీజేపీ నేతలకు కలసిరాని ఆగష్టు... ఇదే నెలలో ముగ్గురు ప్రముఖులు మృతి
ఆగష్టు నెల బీజేపీ నేతలకు కలిసి రావడం లేదా...? బీజేపీ సీనియర్ నేతలు మాజీ కేంద్రమంత్రులు అయిన సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ ఇద్దరూ స్వర్గస్తులయ్యారు. వీరిద్దరూ కొద్దిరోజుల వ్యవధిలోనే కాలం చేశారు. అయితే ఇదే ఆగష్టు నెలలో గతేడాది మాజీ ప్రధాని వాజ్పేయి కూడా కన్నుమూశారు. ఇలా ఆగష్టు నెలలో పలువురు బీజేపీ ప్రముఖలు మృతి చెందడం కలవరపాటుకు గురిచేస్తోంది.
అరుణ్ జైట్లీ కన్నుమూత
కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం 12:07 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. జైట్లీ మరణించారన్న వార్త దావనంలా వ్యాపించడంతో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అప్పటివరకు చికిత్సకు జైట్లీ స్పందిస్తున్నారన్న వార్త వారిలో ధైర్యం నింపినప్పటికీ... వూహించని పరిస్థితుల్లో జైట్లీ మరణవార్త బయటకు వచ్చింది. దీంతో విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ జైట్లీ మృతిపట్ల సంతాపం తెలిపారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా హైదరాబాదు పర్యటన ముగించుకుని హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు జైట్లీ మృతిపట్ల సంతాపం తెలిపారు. జైట్లీ గత కొద్దిరోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆగష్టు నెలలో తన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఎయిమ్స్లో అడ్మిట్ అయ్యారు.
జైట్లీ కంటే ముందు గుండెపోటుతో సుష్మా స్వరాజ్ కన్నుమూత
అయితే ఇదే ఆగష్టు నెలలో జైట్లీ కంటే ముందుగా మరో మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ మృతి చెందారు. ఆగష్టు 6వ తేదీన సుష్మా స్వరాజ్కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆమెను ఎయిమ్స్లో అడ్మిట్ చేశారు. సుష్మా స్వరాజ్ను బతికించేందుకు వైద్యులు శాయశక్తుల ప్రయత్నించారు. అయితే పరిస్థితి విషమించడంతో సుష్మా స్వరాజ్ రాత్రి 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. సుష్మా స్వరాజ్ మృతితో బీజేపీ ఓ మంచి మహిళానేతను కోల్పోయింది. ఇక గతేడాది ఆగష్టు 16న మాజీ ప్రధాని బీజేపీ కురవృద్ధుడు అటల్ బిహారీ వాజ్పేయి కన్నుమూశారు. వయసు మీద పడటంతో అనారోగ్యానికి గురైన వాజ్పేయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
గతేడాది ఆగష్టులో మాజీ ప్రధాని వాజ్పేయి మృతి
వాజ్పేయి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఎమెర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. భారతీయ జనసంఘ్, భారతీయ జనతాపార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. కొత్తతరం రాజకీయాలకు వాజ్పేయి ఊపిరి పోశారు. ఆయన హయాంలో దేశం సాంకేతిక పరంగా అడుగులు ముందుకేసింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్లింది. వాజ్పేయి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో గౌరవించింది.