నీరవ్ మోడీకి చెందిన రూ. 329 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
ముంబై: పారిపోయిన ఆర్థిక నేరస్తుల చట్టం 2018 ప్రకారం వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన రూ. 329.66 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం వెల్లడించింది. ముంబైలోని పీఎన్బీ బ్రాంచీలో 2 బిలియన్ డాలర్లకు పైగా బ్యాంకు మోసం చేసి మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ ఛోక్సీని ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, తాజాగా జప్తు చేసిన ఆస్తుల్లో ముంబై వర్లీలోని సముద్రా మహల్ బిల్డింగ్లోని 4 ఫ్లాట్లు, సముద్ర తీరాన ఉన్న ఫాంహౌజ్, అలీబాగ్లోని వ్యవసాయ భూమి, జైసల్మేర్లోని విండ్ మిల్లు, లండన్లో ఒక ఫ్లాట్, యూఏఈలోని ఫ్లాట్లతోపాటు షేర్లు, బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి.
ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు జూన్ 8న నీరవ్ మోడీ ఆస్తులను జప్తు చేయడానికి ఈడీకి అధికారం ఇచ్చింది. ఇప్పటికే నీరవ్ మోడీకి చెందిన 2వేల కోట్లకుపైగా ఆస్తులను దర్యాప్తు సంస్థలు జప్తు చేశాయి.
గత డిసెంబర్ 5న నీరవ్ మోడీని పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా కోర్టు ప్రకటించింది. కాగా, ప్రస్తుతం పరారీలో ఉన్న నీరవ్ మోడీ లండన్లో తలదాచుకున్నాడు. అక్కడే ఆయన అరెస్టయ్యారు. నీరవ్ మోడీని భారత్ కు తీసుకొచ్చేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.