ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు వచ్చేసింది...పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏమిటి..?
ఇప్పటి వరకు బ్యాంకింగ్ సేవలకు సమానంగా ఇతర ప్రైవేట్ సంస్థలు తమ పేమెంట్ బ్యాంకింగ్ సర్వీసుల ద్వారా సేవలందిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ సంస్థ అయిన భారత తపాలా శాఖ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పేరుతో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. జనవరి 2017లో పైలట్ ప్రాజెక్టు క్రింద కొన్ని బ్రాంచీల్లో ప్రారంభమైనప్పటికీ అధికారికంగా మాత్రం సెప్టెంబర్ 1న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో గేమ్ ఛేంజర్గా మారుతుందని అప్పట్లో అంతా భావించారు. కానీ 20 నెలల్లో ప్రైవేట్ పేమెంట్ సంస్థలు రంగంలోకి దిగడంతో అసలు ఆటే మారిపోయింది.
పేమెంట్ బ్యాంక్ సేవలతో ఇండియా పోస్టల్ శాఖ తనకున్న మూడు లక్షల మంది పోస్ట్మెన్లను 1.55 లక్షల బ్రాంచీలలో టెక్నాలజీ వినియోగించి మంచి బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకురావాలని భావిస్తోంది.
అసలు పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏమిటి..?
పేమెంట్ బ్యాంక్స్ ఓ రకమైన బ్యాంకింగ్ వ్యవస్థను కలిగి ఉంటాయి. బ్యాంకులో జరిగే భారీ స్థాయి లావాదేవీలు కాకపోయినప్పటికీ ఈ సేవలతో చాలా మంది లాభపడుతున్నారు. రెగ్యులర్ బ్యాంకుల్లానే ఇవీ పనిచేస్తాయి... రూ.లక్ష వరకు నగదు బదిలీ చేసేందుకు కూడా వీలుంటుంది కానీ ఇక్కడ మాత్రం రుణం పొందేందుకు వీలుండదు. నగదు బదిలీతో పాటు, బిల్ పేమెంట్స్, మర్చంట్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. భారత్లో పేమెంట్ సేవలు ఆర్థిక వ్యవస్థలో భాగంగా నచికేత్ మోర్ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు అయ్యాయి. బ్యాంకింగ్ గురించి పూర్తిగా తెలియని వారికోసం సాధారణ బ్యాంకింగ్ గురించి తెలియజెప్పేందుకు ఈ తరహా పేమెంట్ బ్యాంక్స్ ఏర్పాటు అయ్యాయి.
పేమెంట్ బ్యాంక్స్తో నిలకడలేని ప్రయాణం
ఆగష్టు 2015న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11 సంస్థలకు పేమెంట్ బ్యాంకులు నిర్వహించుకోవచ్చంటూ లైసెన్సులు జారీ చేసింది. మొత్తం 41 సంస్థలు దరఖాస్తు చేసుకోగా వాటిలో 11 సంస్థలకే ఆర్బీఐ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కానీ పేమెంట్ బ్యాంకింగ్ సేవలపై మాజీ ఎస్బీఐ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటికి సరైన దిశానిర్దేశం లేదన్నారు. ముందుగా ప్రభుత్వం దగ్గర పేమెంట్ బ్యాంకులు అధిక మొత్తంలో తమ సెక్యూరిటీలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ వ్యాపారంలో లాభాలను ఆశించవచ్చా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇక ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం పేమెంట్స్ బ్యాంకింగ్ సేవింగ్ అకౌంట్ ఉన్న వారికి రూ.లక్ష కంటే ఎక్కువగా డిపాజిట్ చేసే వీలు లేదు.అంతేకాదు సాధారణ బ్యాంకుల్లాగా పేమెంట్ బ్యాంకులు రుణాలు ఇవ్వకూడదు. పొదుపు ఖాతాలు ఉన్నవారికి ఆకర్షించే వడ్డీని ఇవ్వవు. ఉదాహరణకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకులు ప్రారంభం కొత్తలో అంటే 2017లో 7.25 శాతం వడ్డీని తమ పొదుపు ఖాతాదారులకు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి ఆ వడ్డీ 4 శాతమే ఉంటుందని మరో ప్రకటన చేసింది.ఇదిలా ఉంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు మాత్రం 4.5 శాతం నుంచి 5శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ప్రైవేట్ పేమెంట్ బ్యాంకుల్లో ఎప్పుడూ పెనాల్టీలే..!
ప్రైవేట్ పేమెంట్ బ్యాంకులపై ఆర్బీఐ పలుమార్లు పెనాల్టీలు విధించింది. ఇందుకు కారణం కస్టమర్కు తెలియకుండా అకౌంట్ ఓపెన్ చేయడమే. సరైన కేవైసీ లేకుండా, మితిమీరిన డిపాజిట్లు చేయడంతో ఆర్బీఐ పెనాల్టీ విధించింది. ఉదాహరణకు మార్చి 2018లో ఆర్బీఐ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేసింది. అంతేకాదు రూ.5 కోట్లు జరిమానా విధించింది. కస్టమర్కు తెలియకుండా కస్టమర్ పేరుతో ఖాతా తెరిచింది. గతేడాది జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య 23 లక్షల మంది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్స్లో రూ.47 కోట్లు డబ్బును సబ్సిడీ పేరుతో డిపాజిట్ చేసింది. అసలు అకౌంటే లేని కస్టమర్ ఇది చూసి షాక్ అయ్యాడు. దీంతో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సీఈఓ శశి అరోరా దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. మరో పేమెంట్ బ్యాంక్ సంస్థ పేటీఎంకు కూడా కొన్ని నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆర్బీఐ నోటీసులు పంపింది.
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎలా ఉండనుంది..?
భారత తపాలా శాఖ కింద ఈ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ప్రారంభమైంది. ఇది పూర్తిగా ప్రభుత్వం అధీనంలోకి వస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక పోస్టాఫీస్ బ్రాంచ్లు భారత్లోనే ఉన్నాయి. ఇందులో 650 బ్రాంచీల్లో పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ సంస్థలైన ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, ఐడియా సంస్థలు కేవలం ఆన్లైన్ ద్వారానే సేవలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలు ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఏజెంట్లతోనే ఇది నడుస్తుంది. పోస్టుమ్యాన్లే ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. అయితే కేవలం పోస్టుమ్యాన్లే కాకుండా ఇతరులు కూడా ఏజెంట్గా ఉండొచ్చు.