పద్మావత్ సినిమాపై ఆందోళనలు ఆపలేదు: కర్నాసేన చీఫ్
జైపూర్: పద్మావత్ సినిమాపై కర్ణిసేన వర్గం శాంతించినట్లుగా, ఇకపై సినిమాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేయబోమని ప్రకటించినట్లు శనివారం ఉదయం వార్తలు వచ్చాయి. ఈ వార్తలను శ్రీ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షులు లోకేంద్ర సింగ్ కల్వీ ఖండించారు.
అదంతా అవాస్తవమన్నారు. ఈ సినిమాపై ఆందోళనలను ఆపలేదని తేల్చి చెప్పారు. భవిష్యత్లో మరిన్ని చేస్తామన్నారు. దేశంలో నకిలీ కర్ణిసేన బృందాలు పుట్టుకొస్తున్నాయన్నారు. ప్రస్తుతం అలాంటివి ఎనిమిది ఉన్నాయని చెప్పారు. అవే ఈ నకిలీ వార్తలను సృష్టిస్తున్నాయన్నారు.
నిజమైన కర్ణిసేన దేశంలో ఒకటే ఒకటి ఉందని, ఆ సంస్థకు తానే వ్యవస్థాపకుడిని అని చెప్పారు. పద్మావత్పై తామే ఆందోళన మొదలు పెట్టామని, అది కొనసాగుతోందన్నారు.
పద్మావత్పై నిరసనలను ఆపేస్తున్నట్లు శ్రీ రాజ్పుత్ కర్ణిసేన ముంబై నాయకుడు యోగేంద్ర సింగ్ కటార్ చెప్పినట్లు శనివారం ఉదయం వార్తలు వచ్చాయి. కొందరు కర్ణిసేన నాయకులు సినిమా చూసి మనసు మార్చుకున్నారని యోగేంద్ర తెలిపారు. సినిమాలో రాజ్పుత్ల శౌర్యాన్ని గొప్పగా ప్రశంసించారని, సినిమా తమ గౌరవాన్ని మరింత పెంచేలా ఉందన్నారు.
రాజ్పుత్ల గౌరవం పెంచేలా ఉందని, పద్మావతి గౌరవాన్ని ఇనుమడించేలా ఉందన్నారు. పద్మావతి, ఖిల్జీలు ఎదురుపడే సన్నివేశం లేదన్నారు. కాబట్టి పద్మావతిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వార్తలు రావడంతో లోకేంద్ర స్పందించారు.