కావేరీ తీర్పు: హీరో రజనీకాంత్ దిష్టిబోమ్మలు దహనం, ధర్నా, కన్నడ ద్రోహి, నీ సినిమాలు!
బెంగళూరు: కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడుకు చాలా అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో స్పందించారు. రజనీకాంత్ స్పందనపై కర్ణాటకలో రైతు, కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ దిష్టిబోమ్మలు దహనం చేసి ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసి నీ సినిమాలు విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
Recommended Video
కావేరీ జలాలు
కావేరీ జలాల పంపిణి విషయంలో శుక్రవారం సుప్రీం కోర్టు అంతిమ తీర్పు ఇచ్చింది. తమిళనాడుకు గతంలో విడుదల చేస్తున్న 198 టీఎంసీల కంటే తక్కువగా 177 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
రజనీ, కమల్ హాసన్
కావేరీ జలాల పంపిణిపై సుప్రీం కోర్టు తీర్పు విషయంలో మొదట స్పందించిన హీరో కమల్ హాసన్ తమిళనాడు రైతులకు అన్యాయం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. తరువాత అభిమానులు ఒత్తిడి చెయ్యడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియాలో స్పందిస్తూ తమిళనాడుకు చాల అన్యాయం జరిగిందని అన్నారు.
కర్ణాటక ద్రోహి
రజనీకాంత్ స్పందనపై కర్ణాటక జనపర వేదిక నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇక్కడ పుట్టి పెరిగి తరువాత తమిళనాడు వెళ్లి స్థిరపడిన రజనీకాంత్ కర్ణాటకకు ద్రోహం చేశాడని జనపర వేదిక నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రజనీకాంత్ సినిమాలు
కర్ణాటకలోని రామనగర, చెన్నపట్టణ తదితర ప్రాంతాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ దిష్టిబోమ్మలు దహనం చేసి ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రజనీకాంత్ నటించే అన్ని సినిమాలు కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకుంటామని జనపర వేదిక నాయకులు హెచ్చరించారు.
రాజకీయ డ్రామాలు
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రజలను మాయ చెయ్యడానికి కావేరీ జలాల పంపిణి విషయంలో రజనీకాంత్ రాజకీయం చేస్తున్నాడని, అతను కన్నడ ద్రోహి అని కర్ణాటక జనపర వేదిక నాయకులు మండిపడుతున్నారు.