కేంద్ర మంత్రికి బళ్లారిలో సెగ: అడుగుపెట్టారు, మాకు పాపాలు వస్తాయి, ఎంపీ శ్రీరాములు!
బెంగళూరు: కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేకి కర్ణాటకలోని బళ్లారి నగరంలో చేదు అనుభవం ఎదురైయ్యింది. నిత్యం వివాదాలతో వార్తల్లో ఉంటున్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే కారు అడ్డుకున్న దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆయనకు కొంత సేపు సినిమా చూపించారు.
పాపాలు చుట్టుకున్నాయి
అనంత్ కుమార్ హెగ్డే లాంటి వ్యక్తి బళ్లారి నగరంలో అడుగుపెట్టడంతో మాకు పాపాలు చుట్టుకున్నాయని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. ఇటీవల కర్ణాటకలోని కోప్పాల జిల్లాలో జరిగిన బహిరంగ సభ సమావేశంలో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజ్యంగం మార్చేస్తాం
డాక్టర్ బీఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యంగంలో మార్పులు చేస్తామని అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ సందర్బంలో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే క్షమాపణలు చెప్పారు.
ప్రతిపక్షాలు
ప్రతిపక్షాలు, దళిత సంఘాలు అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. శనివారం బళ్లారికి వెళ్లిన అనంత్ కుమార్ హెగ్డే గెస్ట్ హౌస్ లో బసచేశారు. తరువాత గెస్ట్ హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో దళిత సంఘం నాయకుడు మానయ్య ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
అంబేద్కర్ కు అవమానం
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కారును అడ్డగించిన దళిత సంఘాలు మీరు అంబేద్కర్ నే అవమానించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆ సందర్బంలో బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు వచ్చి అనంత్ కుమార్ వ్యాఖ్యలకు తన మద్దతుకూడా లేదని, నేను క్షమాపణలు చెబుతున్నారని చెప్పారు.
పోలీసులు, ఎంపీ శ్రీరాములు
దళిత సంఘాల నాయకులు అనంత్ కుమార్ వెళ్లడానికి వీలులేదని అడ్డుకున్నారు. అనంతరం ఎంపీ శ్రీరాములు, ఆయన అనుచరుల సహాయంతో పోలీసులు ఆందోళనకారులు పక్కకు తీసుకెళ్లి మంత్రి కారు వెళ్లడానికి అవకాశం కల్పించారు. అనంతరం దళిత సంఘాల నాయకులతో బీజేపీ ఎంపీ శ్రీరాములు చర్చలు జరిపారు.