26న ట్రాక్టర్ల ర్యాలీ చేసి తీరుతాం, జాతీయ జెండాలతోనే..: రైతు నేతలు
న్యూఢిల్లీ: జనవరి 26న దేశ రాజధానిలో కిసాన్ ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తామని సంయుక్త్ కిసాన్ మోర్చా(40 రైతు సంఘాలతో కూడిన జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ) స్పష్టం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2024 మే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాజేష్ టేకాయత్ ఆదివారం తెలిపారు.
న్యూఢిల్లీలో రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ పరేడ్ కార్యక్రమానికి తాము ఎలాంటి ఆటంకం కలిగించమని పేర్కొన్నారు. ఆ కార్యక్రమానికి 50 కిలోమీటర్ల దూరంలో కిసాన్ ట్రాక్టర్ మార్చ్ ను శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు.
ప్రతి ట్రాక్టర్ కూడా త్రివర్ణ పతాకంతో ఈ ర్యాలీలో పాల్గొంటుందన్నారు. ట్రాక్టర్లపై ఏ రాజకీయ పార్టీ జెండాను ప్రదర్శించబోమని చెప్పారు. న్యూఢిల్లీకి రాలేనివారందరూ వారి వారి గ్రామాల్లో ట్రాక్టర్ల మార్చ్ నిర్వహించాలని కోరారు. కాగా, పలువురు రైతులు పంజాబ్ రాష్ట్రంలో మాక్ ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించాలన్నారు.
కరోనా కారణంగా ఎక్కువ మంది గుమిగూడటాన్ని తగ్గిస్తున్నామని, ఇంతకుముందు 1.5 లక్షల మంది ఉంటే.. ఇప్పుడు 25వేల మందికే పరిమితం చేసిటన్లు ఏసీపీ తెలిపారు. 15 ఏళ్లలోపు పిల్లలను, 65 ఏళ్లకు మించిన పెద్దవాళ్లను ఈ కార్యక్రమానికి రానివ్వడం లేదని చెప్పారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపారు.
కాగా, రైతు సంఘాల నేత గుర్నమ్ సింగ్ ఇతర పార్టీల రాజకీయ నేతలను కలవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలపై దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. నూతన వ్యవసాయ చట్టాలు చర్చించేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.