నిప్పుల కుంపటిని తట్టుకోవడం ఎలా: రైతులకు కొత్త సవాల్: ధీటుగా ఏర్పాట్లు
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోజుల తరబడి న్యూఢిల్లీ సరిహద్దుల్లో నిరసన దీక్షలను కొనసాగిస్తోన్న రైతులు కొత్త సమస్యను ఎదుర్కొనబోతోన్నారు. మొన్నటిదాకా ఎముకలు కొరికే చలిని సైతం వెరవకుండా ఆందోళనలను సాగించిన అన్నదాతలకు ఇక ఎండ రూపంలో కొత్త సవాల్ ఎదరవుతోంది. నిప్పుల కుంపటిని తలపించేలా ఎదురయ్యే వేసవి కాలాన్ని అధిగమించడంపై ఫోకస్ పెట్టారు. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు.
ఇప్పటిదాకా సాగిన ఈ ఆందోళనలు ఒక ఎత్తు కాగా.. ఇక వేసవి కాలాన్ని ఎదుర్కొనడం మరో ఎత్తుగా మారింది. మండు వేసవిని ధీటుగా ఎదర్కొనడానికి ఏర్పాట్లు చేపట్టారు. షెడ్లు, దోమ తెరలు, ఫ్యాన్లు, కూలర్లను అందుబాటులో ఉంచుకోనున్నారు. దీనికోసం పెద్ద ఎత్తున కూలర్లు, ఫ్యాన్లను ఆర్డర్ చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు మన్నూ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. ఘాజిపూర్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరాలను ఆయన సందర్శించారు. ఎండా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కూలర్లు, ఫ్యాన్లను ఇప్పటికే ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి అవి శిబిరాలకు అందుతాయని చెప్పారు.
వేసవి కాలానికి అవసరమైన ఇతర వస్తువులు కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా.. ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉద్యమం కొనసాగేలా అన్ని చర్యలను తీసుకుంటామని అన్నారు. గడ్డకట్టించే చలిని అవలీలగా ఎదుర్కొన్నామని, ఇక మండే ఎండలను కూడా లెక్కచేయబోమని ధీమా వ్యక్తం చేశారాయన. పలు రైతు సంఘాలు సైతం కూలర్లు, దోమ తెరలు, ప్లాస్టిక్ షీట్లు, సమ్మర్ టెంట్లు మొదలైనవి ఆర్డర్ చేశాయని పేర్కొన్నారు.
టార్పాలిన్లకు బదులుగా దోమతెరలను ఏర్పాటు చేస్తామని మహేంద్ర పాల్ సింగ్ వెల్లడించారు. మంచినీటిని 24 గంటల పాటు అందుబాటులో ఉంచుతామని అన్నారు. రైతులు డీహైడ్రెషన్కు గురికాకుండా ఉండటానికి అవసరమైన పానీయాలు సిద్ధం చేస్తామని తెలిపారు. వేసవిలో ఉద్యమాన్ని కొనసాగించడానికి అవసరమైన సదుపాయాలు ఏర్పాట్లు చేయడానికి గురుద్వారా కమిటీలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఉద్యమ నేతలు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టినా దాన్ని తిప్పికొడతామని చెప్పారు.