ఢిల్లీలో ఆందోళనకారుల బీభత్సం, రెండు ఇళ్లు సహా ఫైరింజన్కు నిప్పు.. రంగంలోకి పోలీసులు..
పౌరసత్వ సవరణ చట్టం సెగలు దేశ రాజధాని ఢిల్లీలో రగులుతూనే ఉన్నాయి. ఆదివారం జాఫ్రాబాద్ వద్ద సీఏఏకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి రహదారిని మూసివేశారు. అక్కడే మరికొందరు సీఏఏకు అనుకూలంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఆ టెన్షన్ సిచుయేషన్ ఆదివారం నుంచి సోమవారానికి మారింది. సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనకారులు రెచ్చిపోయారు.
జాఫ్రాబాద్, మౌజ్పూర్లో రెండోరోజు ఆందోళనకారులు పెట్రేగిపోయారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇంతలో కొందరు ఆందోళనకారులు రెండు ఇళ్లతోపాటు ఫైరింజన్కు కూడా నిప్పుపెట్టారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు.
అయితే అగ్నిమాపక సిబ్బంది వాహనంపై కూడా ఆందోళనకారులు ప్రతాపం చూపించారు. వాహనాన్ని ధ్వంసం చేయడమే గాక నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు తమ చేతులకు పనిచెప్పారు. జాఫ్రాబాద్లో గల చాంద్బాగ్లో కూడా హింస చెలరేగింది. వెంటనే ఘటనాస్థలంలోకి వచ్చిన పోలీసులు ఆందోళనకారులను తరిమేసేందుకు లాఠీచార్జీ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఆందోళనల నేపథ్యంలో జాఫ్రాబాద్, మౌజ్పూర్, బాబర్పూర్ వద్ద మెట్రో రైలు ఎంట్రీ, ఎగ్జిట్ నిషేధించినట్టు మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి దిగజారడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు ట్వీట్ చేశారు. జాఫ్రాబాద్లో గత 24 గంటల నుంచి మెట్రో రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చాక మెట్రో రైల్ సేవలను పునరుద్ధరిస్తామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.