తమిళనాడు సెక్రటేరియట్ ముట్టడి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోసిన విద్యార్థులు !
నీట్ పరీక్షలో అర్హత సాధించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి అనితకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం అయ్యాయి.
చెన్నై: నీట్ పరీక్షలో అర్హత సాధించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి అనితకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం అయ్యాయి. ఆందోళనకారులను తమిళనాడు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.
శనివారం అనిత కుటుంబ సభ్యులకు న్యాయం చెయ్యాలని, ఆమె ఆత్మహత్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాద్యత వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, వివిద పార్టీల కార్యకర్తలు, స్వచ్చంద సంస్థల నిర్వహకులు చెన్నైలో సెక్రటేరియట్ ను ముట్టడించడానికి ప్రయత్నించారు.
ర్యాలీగా వెలుతున్న విద్యార్థులు, వివిధ పార్టీల కార్యకర్తలు, మహిళా సంఘాల నాయకులను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థి సంఘాలు మెరీనా బీచ్ లో గుమికూడటానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
విద్యార్థులు అధిక సంఖ్యలో బైకుల్లో మెరీనా బీచ్ కు చేరుకుంటారని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో మెరీనా బీచ్ పరిసర ప్రాంతాల్లోని రోడ్లలో ద్విచక్ర వాహనాల సంచారాన్ని నిషేధించారు. వీసీకే పార్టీ చీఫ్ తిరుమావలన్ పిలుపుమేరకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. వీసీకే పార్టీకి చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.