ఘోరం: నిఫ్ట్ విద్యార్థినిని ఎత్తుకెళ్లి, కిట్ క్యాంప్లో గ్యాంగ్రేప్ చేశారు
భువనేశ్వర్: ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై ఆకృత్యాలు ఆగడం లేదు. తాజాగా ఒరిస్సా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భువనేశ్వర్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది.
శుక్రవారం అర్ధరాత్రి దాటాక రైల్వే స్టేషన్ నుంచి నిఫ్ట్లోని హాస్టల్కు వస్తున్న విద్యార్థినిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా కిట్ క్యాంపస్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన విద్యార్థులు శనివారం ఉదయం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థిని తనను రక్షించమని కేకలు వేస్తున్నా అక్కడే ఉన్న సెక్యూటిరీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థులు ఆరోపించారు. అంతేగాక ఈ ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు హస్తం కూడా ఉందని ఆరోపించారు.
విద్యార్థుల ఆందోళనతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. వారిపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. కాగా, రేప్ వార్తలను పోలీసులు ఖండించారు. అటువంటిది జరిగినట్టు తమకు సమాచారమేదీ లేదన్నారు. బాధిత విద్యార్థిని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
కిట్ యాజమాన్యం కూడా రేప్ ఆరోపణలను ఖండించింది. తమ క్యాంపస్లో అటువంటి ఘటనేమీ జరగలేదని, నిఫ్ట్లో అది జరిగి ఉంటుందని కిట్ స్టూడెంట్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ సుచేత చెప్పారు.
అయితే విద్యార్థుల వాదన మాత్రం మరోలా ఉంది. ఏం జరిగిందో చెప్పకుండా విద్యార్థిని భయపెడుతున్నారని ఆరోపించారు. సీసీ ఫుటేజీ పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్డెన్, సెక్యూరిటీ గార్డులను విచారిస్తున్నట్లు తెలిపారు.