అలహాబాద్లో లా విద్యార్థిని కొట్టి చంపారు: వీధుల్లోకి విద్యార్థులు, బస్సు దగ్ధం
అలహాబాద్: యూపీలోని అలహాబాద్లో దారుణం జరిగింది. లా కోర్స్ చేస్తున్న విద్యార్థిని కొంతమంది దుండగులు కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి లా స్టూడెంట్ దిలీప్(26) తన ఇద్దరు స్నేహితులతో కలిసి కర్నాల్గంజ్లోని ఓ రెస్టారెంట్కు వెళ్లారు.
ఈ సమయంలోనే దిలీప్కు మరో ముగ్గురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో దిలీప్ను ఆ ముగ్గురు కలిసి రాళ్లు, కర్రలతో చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన దిలీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడు విజయ్ శంకర్ సింగ్(రైల్వే ఉద్యోగి)ను పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు, దిలీప్ను దుండగులు కొట్టిన సమయంలో పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వనందుకు రెస్టారెంట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని దిలీప్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా దిలీప్ హత్య నేపథ్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున అలహాబాదులో నిరసనలు చేపట్టారు. వీధుల్లో నినాదాలు చేశారు. అలహాబాద్ వర్సిటీ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చి పోలీసు అధికారుల కార్యాలయం ఎదుట నిరసనలకు దిగారు. ఓ బస్సును తగులబెట్టారు. రాళ్లు విసిరారు.