షాహీన్ బాగ్ : ఇతరుల హక్కులకు భంగం.. బహిరంగ ప్రదేశాల్లో నిరసనలపై సుప్రీం కీలక తీర్పు...
భారత రాజ్యాంగం ప్రజలకు నిరసన తెలిపే హక్కును ఇచ్చిందని... కానీ బహిరంగ ప్రదేశాల్లో ఆందోళనలు,నిరసన కార్యక్రమాలతో జనజీవనానికి ఆటంకం కలిగించవద్దని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఇది ఇతర ప్రజల హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంది. శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమే అయినప్పటికీ... షాహీన్ బాగ్ తరహాలో బహిరంగ ప్రదేశాలను ఆక్రమించడం సరికాదని పేర్కొంది. పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను నిరసిస్తూ ఢిల్లీలోని షాహీన్బాగ్లో గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు సుదీర్ఘంగా సాగిన నిరసనలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై కోర్టు ఇలా స్పందించింది.
అప్పటి పరిస్థితులను ఇప్పటితో పోల్చలేమని...
బహిరంగ ప్రదేశాలను ఆక్రమించి నిరసనలు తెలపడం ఆమోదయోగ్యం కాదని చెప్పేందుకు న్యాయస్థానం ఏమాత్రం సంకోచించట్లేదని తెలిపింది. ఇలాంటి కేసుల్లో పోలీసులు కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూడటకుండా తమ పని తాము చేయాలని సూచించింది. స్వాతంత్య ఉద్యమ సమయంలోనూ ఇలా రోడ్లను ఆక్రమించి నిరసనలు తెలియజేశారని... కానీ ఇప్పటి పరిస్థితులను అప్పటితో పోల్చలేమని చెప్పింది.
కేటాయించిన ప్రదేశాల్లోనే...
వ్యక్తులు లేదా సమూహాలెవరైనా బహిరంగ ప్రదేశాల్లో నిరసన ప్రదర్శనలు సరికాదని... అందుకోసం తమకు ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లోనే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోర్టు సూచించింది. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో భారీగా జన సమూహాలను ఆకర్షించేందుకు దాన్ని ఉపయోగించుకుంటున్నారని... ఇదే సీన్ షాహీన్ బాగ్లోనూ కనిపించిందని తెలిపింది. ఈ కేసుపై సెప్టెంబర్ 21న తీర్పును రిజర్వ్లో పెట్టిన కోర్టు నేడు స్పష్టమైన తీర్పునిచ్చింది.
సుప్రీం తీర్పుపై హర్షం...
సుప్రీం తాజా తీర్పుపై షాహీన్ బాగ్ మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.నాసిర్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. షాహీన్బాగ్ నిరసనల కారణంగా దాదాపు 200 షాపులు మూతపడ్డాయని... 2000 మంది వరకు ఉద్యోగ,ఉపాధి కోల్పోయారని చెప్పారు. అన్ని షాపులు బ్రాండెడ్ వస్తువులకు సంబంధించినవేనని... కోట్లలో నష్టాలను చవిచూశామని అన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నంద్ కిశోర్ గార్గ్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. షాహీన్ బాగ్ నిరసనలతో ఇంత విధ్వంసం జరుగుతున్న ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించిందని తన పిటిషన్లో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలను ఆక్రమించుకోకుండా,దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
Recommended Video
ఎందుకీ ఆందోళనలు...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకి వ్యతిరేకంగా షాహీన్ బాగ్లో గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. సీఏఏ పౌరసత్వ చట్టంతో ముస్లింకు అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది ఆఫ్ఘనిస్తాన్,పాకిస్తాన్ లాంటి పొరుగు దేశాల్లో అక్కడ అణచివేతకు గురవుతున్న వారికి ఆశ్రయం కల్పించేందుకు ఉద్దేశించిన చట్టమని... ఇక్కడి ముస్లింలపై ఇది ఎలాంటి ప్రభావం చూపించదని ప్రభుత్వం చెబుతోంది. అయితే సీఏఏ ద్వారా హిందువులు,బౌద్దులు,క్రైస్తవులు,పార్శీలకు పౌరసత్వ అవకాశం కల్పించిన ప్రభుత్వం ముస్లింలను విస్మరించడంపై వారి నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.