రిజర్వేషన్ ఫైట్: హింసాత్మకంగా మారిన మరాఠాల ఆందోళనలు
ఔరంగాబాద్: మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ తహసీల్దార్ పరిధిలో మరాఠా సామాజిక వర్గంవారు తమ నిరసనను తెలిపారు. ఔరంగాబాద్ పూణే హైవేపై నిన్నటినుంచి బైటాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కాకాసాహెబ్ షిండే అనే వ్యక్తి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పక్కనే ఉన్న గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నిరసనకారులు తీవ్ర ఆందోళనకు దిగారు.
వ్యక్తి మృతి చెందడంతో మరాఠా క్రాంతి మోర్చా సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఔరంగాబాద్ పూణే హైవేపై వస్తున్న బస్సును అడ్డగించి నిప్పుపెట్టారు. ముంబై పూణే హైవేపై కూడా నిరసనకారులు బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న తమను పోలీసులు రెచ్చగొట్టారని నిరసనకారులు చెబుతున్నారు. నిజంగా మరాఠా రక్తం తమ నరాల్లో ప్రవహిస్తున్నట్లయితే నీటిలో సమాధి అవ్వండటూ పోలీసులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నిరసనకారులు చెప్పారు.
మరోవైపు నిన్న ఆత్మహత్య చేసుకున్న యువకుడి అంత్యక్రియలు హాజరయ్యేందుకు వెళ్లిన శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైర్ పై స్థానికులు దాడి చేశారు. అతని కాన్వాయ్ను అడ్డుకుని ఆయనపై దాడి చేశారు.ప్రభుత్వం ముందు తాము 30 డిమాండ్లు ఉంచామని... అందులో ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని నిరసనకారులు చెప్పారు. మరాఠా ప్రజల నిరసనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంలేదని త్వరలో ఫడ్నవీస్ సర్కార్కు బుద్ధి వచ్చేలా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు.