ఐఏఎస్ రవి అభిమాని ఆత్మహత్య: ఇంటర్ పరీక్షలు వాయిదా
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి మరణాన్నిజీర్ణించుకోలేని ఆయన అభిమాని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోలారు జిల్లా ముళబాగిలు తాలుకా, తిరుమనహళ్ళిలో జరిగింది. తిరుమనహళ్ళిలో నివాసం ఉంటున్న గోపాల్ (40) అనే వ్యక్తి మంగళవారం ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రవి కోలారు జిల్లా కలెక్టెర్ గా పని చేసిన సమయంలో గోపాల్ రెండు మూడు సార్లు ఆయనను కలిశారు. తన సమస్యలు పరిష్కరించాలని గోపాల్ మనవి చేసిన సమయంలో రవి సరైన సమయంలో స్పందించారు. సోమవారం రాత్రి ఐఏఎస్ అధికారి రవి ఆత్మహత్య చేసుకున్నారని తెలుసుకున్న గోపాల్ కుమిలిపోయారు.
మంగళవారం ఉదయం మళబాగిలువు వెళ్లి డి.కే. రవి చిత్రపటం ఉన్న ఫ్లెక్సీలు తీసుకుని సొంత గ్రామానికి వెళ్లారు. తరువాత గ్రామం మధ్యలో ఫ్లెక్సీలు పెట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి గోపాల్ నేరుగా ఇంటికి వెళ్లారు.
భార్యాబిడ్డలను బయటకు పంపించిన గోపాల్ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపాల్ ఆత్మహత్య చేసుకోవడంతో తిరుమనహళ్ళిలో విషాదఛాయలు నెలకొన్నాయి.
టైర్లకు నిప్పు, నిరసనలు, ధర్నాలు
ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పదస్థితిలో మరణించడంతో ఆయన అభిమానులు జీర్ణించుకొలేకపోయారు. బెంగళూరు, కోలారు, తుమకూరు, కోప్పళ తదితర జిల్లాలలో ధర్నాలు నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు. కోలారు జిల్లా మొత్తం స్వచ్చందంగా బంద్ పాటించారు. పలు చోట్ల రోడ్ల మీద టైర్లు వేసి నిప్పంటించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంగళవారం జరగవలసిన ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలు వాయిదా వేశామని అధికారులు తెలిపారు.